జగన్ ఎఫెక్ట్: లగడపాటి సన్యాసం ప్రకటించారు: క్షమించండి..ఇక సర్వేలకు గుడ్ బై..!
ఏపీలో వైసీపీ గెలుపు ఎఫెక్ఠ్ లగడపాటి పైన పడింది. ఊహించిన విధంగా లగడపాటి సర్వేల సన్యాసం ప్రకటించారు. ఇక నుండి సర్వేలు చేయనని స్పష్టం చేసారు. ఏపీలో టీడీపీ గెలుస్తుందంటూ ఫలితాలకు రెండు రోజుల ముందు నుండి లగడపాటి హడావుడి చేసారు. తెలంగాణలో కారెక్కారని..ఏపీలో సైకిల్ ఎక్కారంటూ తన అంచనాలకు ప్రాసలు జోడించి మరీ చెప్పారు. జాతీయ ఛానళ్ల సర్వేలను తప్పు బట్టారు. లగడపాటి సర్వేను నమ్ముకున్న టీడీపీ అధినాయకత్వం సైతం తలలు పట్టుకుంది.

సర్వేలకు సన్యాసం...
ఆంధ్రా ఆక్టోపస్ పేరుతో ఎన్నికల సర్వేల్లో గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఎంపి లగడపాటి ఇక నుండి సర్వేలు చేయటం లేదని ప్రకటించారు. రాష్ట్ర విభజనతో రాజకీయాల నుండి సన్యాసం తీసుకున్న లగడపాటి..ఏపీలో జగన్ గెలుపుతో ఇక సర్వేలను మానుకుంటున్నట్లు స్పష్టం చేసారు. ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పిన లగడపాటి..టీడీపీ గెలవకపోతే ఇక సర్వేలు చేయనని అప్పుడే ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఈ నిర్ణయ తీసుకున్నారు. ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోలేక పోయినందుకు చింతిస్తున్నానంటూ వివరణ ఇచ్చారు. తన ఫలితాల వలన ఎవరైనా ఇబ్బంది పడితే మన్నించాలని అభ్యర్దించారు. పక్షపాతం లేకుండా గతంలో సర్వేలు చేసి సమాచారం ఇచ్చానని.. ఇక పైన సర్వేలు చేయనంటూ లగడపాటి లేఖ విడుదల చేసారు.

మండిపడ్డ టీడీపీ నేతలు..
లగడపాటి సర్వే పైన టీడీపీ మంత్రులే సంతృప్తి వ్యక్తం చేయలేదు. లగడపాటికి ఏం తెలుసని సర్వేలు చేస్తున్నారని ..ప్రజల నాడి తెలుసా అని సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఆయన కారణంగా కోట్లాది రూపాయాల నష్టం జరిగిందని వాపోయారు.

తెలంగాణ ఫలితాల్లో ఫెయిల్
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లోనూ లగడపాటి చెప్పిన జోస్యం తప్పింది. ఇప్పుడు ఏపీ లోనూ అదే జరిగింది. తెలంగాణ ఫలితాల్లో ఫెయిల్ అయిన తరువాత లగడపాటి ఏపీలో జోస్యం చెప్పినా పెద్దగా దీన్ని ఎవరూ పూర్తి స్థాయిలో స్వీకరించలేదు. ఇక, ఇప్పుడు స్వయంగా లగడపాటి సర్వేలకు గుడ్బై చెప్పేసారు.












Click it and Unblock the Notifications