కొత్త సీఎస్ నియామకంలో కొత్త ట్విస్ట్: ఎల్వీ బదిలీ వ్యవహారంపై కేంద్రం ఆరా: ఏం జరుగుతోంది..!
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ రాజకీయ రగడకు కారణమైంది. ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించకుండా ధిక్కార వైఖరితో వవ్యవహరించనందుకే ఆయనను బదిలీ చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబతున్నాయి. ఎల్వీ తన బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు. నెల రోజుల పాటు సెలవు పైన వెళ్లారు. ఇదే సమయంలో ప్రభుత్వం నూతన సీఎస్ గా నీలం సాహ్ని నియామకం వైపు ఆసక్తిగా ఉంది. ఏపీ కేడర కు చెందిన నీలం సాహ్నిని రిలీవ్ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే, ఇదే సమయంలో ఎల్వీ బదిలీ వ్యవహారం..
నూతన సీఎస్ నియామకంలో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఎల్వీ బదిలీ వ్యవహారం పైన ఏపీ బీజేపీ నేతలు కేంద్ర నేతలకు వివరించారు. దీంతో...కేంద్రం సైతం పార్టీ నేతల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. ఇదే సమయంలో కొత్త సీఎస్ గా నీలం సాహ్నిని నియమించాలంటే..ముందుగా కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ చేయాల్సి ఉంది. దీని కోసం ఢిల్లీలోని ఏపి ప్రభుత్వ ముఖ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కేంద్రం అంత తొందరగా నీలం సాహ్నిని రిలీవ్ చేస్తుందా లేదా అనే సందేహం రాజకీయంగా..అదే సమయంలో అధికార వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యం రిలీవ్...నీరబ్ ప్రసాద్కు సీఎస్ బాధ్యతలు అప్పగింత
ఎల్వీ బదిలీ వ్యవహారంపై ఆరా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం పైన అనేక అంశాలు ఉన్నాయంటూ ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు నివేదించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే తప్పు బట్టారు. టీడీపీ నేతలు సైతం అనుమానాలు తలెత్తేలా అనేక అంశాల పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం సీఎస్ ముఖ్యమంత్రి ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించిన కారణంగానే బదిలీ చేయాల్సి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. సీఎస్ బదిలీ సాధారణ విషయంగా మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు దీనిని మత పరమైన అంశాలతో సంబంధం ఉన్నదిగా చెబుతూ ఢిల్లీ నేతలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..దీని పైన వారు కూడా పార్టీ నేతల నుండి వాస్తవాల పైన ఆరా తీసినట్లు పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం. తాజాగా బీజేపీ నేతగా ఉన్న మాజీ సీఎస్ ఐవైఆర్ చేసిన ట్వీట్ కలకలానికి కారణమైంది.
నీలం సాహ్ని రిలీవ్ వెంటనే అయ్యేనా..
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ చేయటానికి కొద్ది సేపు ముందే ప్రభుత్వం ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏయస్ అధికారి నీలం సాహ్నికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నీలం అభిప్రాయం కోరగా..అందుకు అమె సైతం అంగీకరించారు. దీంతో..ప్రస్తుం కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని ఏపీకి రిలీవ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే, ఇప్పుడు కేంద్రం ఏపీ అభ్యర్ధన మేరకు నీలం సాహ్నిని వెంటనే రిలీవ్ చేస్తారా..లేక సమయం తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. తాత్కాలిక సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ కొనసాగుతున్నా..రెగ్యులర్ సీఎస్ ను నియమించాల్సి ఉంది. గతంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు ఐపీయస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర..ఐఏయస్ అధికారిణి శ్రీలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసినా..కేంద్రం మాత్రం ఏపీకి పంపేందుకు ఇప్పటికీ ఆమోదం ఇవ్వలేదు. దీంతో..స్టీఫెన్ తిరిగి తెలంగాణలో కొనసాగుతున్నారు. శ్రీలక్ష్మి కోసం విజయ సాయిరెడ్డి స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి అభ్యర్ధించారు. అయినా..డీఓపీటీ ఇప్పటికీ కొర్రీలు వేస్తూనే ఉంది. ఇక, నీలం సాహ్నికి అటువంటి ఇబ్బందులు లేవని భావిస్తున్నా..కేంద్రం ఏం చేస్తుందనేది మాత్రం అధికార వర్గాల్లో ఆసక్తి కర చర్చ సాగుతోంది.
సీఎందే తుది నిర్ణయం..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి పైన బదిలీ వేటు వేయటం అసాధారణ నిర్ణయంగా ప్రచారం సాగుతున్నా..ముఖ్యమంత్రికి ఆ విషయంలో పూర్తి నిర్ణయాధికారం ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వారికి నోటీసులు ఇవ్వటం ద్వారా ఆయన తొందరపడ్డారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎస్ ను బదిలీ చేసే అధికారంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని..విషయం తెలుసుకోవటం సాధారణంగా జరిగే ప్రక్రియగా చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర..శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్ కు చెందిన అధికారులు కావటంతో..కేంద్రం సాంకేతిక కారణాలు చూపుతూ కొర్రీలు వేయగలిగిందని..నీలం సాహ్ని ఏపీ కేడర్ కు చెందిన అధికారి కావటంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవని సీనియర్ అధికారులు అంటున్నారు.