‘క్షమించాలి.. మూసేశాం! నో ‘పవర్’’: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బొగ్గు కొరతను తీర్చేందుకు సింగరేణి సంస్థ నుంచి బొగ్గు సరఫరాను పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఓ లేఖను రాసిన విషయం తెలిసిందే.

ఏపీ సర్కారుపై పవన్ సెటైర్లు
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక విద్యుత్ సరఫరా ఉండదు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పినట్లుగా ఉన్న ఓ చిత్రాన్ని పవన్ కళ్యాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

క్షమించాలి.. మూసేశాం..
‘క్షమించాలి.. మేము మూసివేశాం. ఇక రాష్ట్రంలో విద్యుత్ లేదు' అని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్పినట్లు ఆయన పోస్టు చేశారు. అంతేగాక, ఏపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం సాయాన్ని కోరుతున్నట్లుగా రాసిన ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని కూడా ఆయన మరో ట్వీట్లో జతచేశారు.

సీఎం కేసీఆర్కు జగన్ లేఖ
కాగా, బొగ్గు సరఫరా చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి కూడా ఓ లేఖ రాశారు.
బోగ్గు సరఫరాకు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.

వర్షాలు, సమ్మెల కారణంగా..
ఒడిశాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, కార్మికుల సమ్మెలతో ఏపీలో బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. దీంతో ప్రతిరోజు 70వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి ఉండగా.. కేవలం 45వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో పూర్తిస్థాయి థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5050 మెగావాట్లుగా ఉంది. ఇందుకోసం ఒరిస్సాలోని మహనది కోల్ లిమిటెడ్, సింగరేణి థర్మల్ కేంద్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది.

సాయం కావాలంటూ జగన్..
ఒప్పందంలో భాగంగా ప్రతి సంవత్సరం సుమారు 18 మిలియన్ టన్నుల బోగ్గును మహానది కోల్ లిమిటెడ్ సరఫరా చేయాల్సి ఉండగా వర్షాలు, సమ్మెల కారణంగా అక్కడ నుండి 57 శాతం మేర బొగ్గు రవాణా తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణ చర్యలకు ఉపక్రమించారు. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు. దీంతోపాటు ఏపీలో విద్యుత్ ఉత్పత్తికి సాయపడేవిధంగా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయాలని కేంద్రానికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications