గోరంట్లకో న్యాయం.. చంద్రబాబుకో న్యాయమా..? ఓటుకు నోటు కేసు ప్రస్తావించిన సజ్జల
గోరంట్ల మాధవ్ ఇష్యూ దుమారం రేపుతోంది. దీనిపై ఇవాళ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ వీడియో ఒరిజనలో, కాదో తెలుసుకోవడానికి అరగంటో, గంటో చాలని అంటున్నారని గుర్తుచేశారు. మరీ ఆనాడు చంద్రబాబునాయుడు పక్కా ఆధారాలతో దొరికిన ఓటుకు నోటు వ్యవహారమే ఇప్పటికీ తేలలేదని సజ్జల అన్నారు.
Recommended Video
రేవంత్ రెడ్డే..?
చంద్రబాబుకు ఆనాడు అంతరంగికుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ కేసులో ఉన్నారని, స్టీఫెన్ సన్ కు బ్యాగు ఇవ్వడం ఉందని చెప్పారు. బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు ఒరిజినల్ వాయిస్ కూడా ఉందని వివరించారు. ఆ వాయిస్కు తగినట్టు అవతల డబ్బులు ఇచ్చిన ఘటన కూడా జరిగిందని అన్నారు. ఆ వాయిస్ చంద్రబాబుదేనని అందరికీ తెలుసని, కానీ ఆయన ఒప్పుకోవడం లేదన్నారు.
అన్ని ఆధారాలు ఉన్నా.. ఈ కేసు ఏడేళ్లయినా తేలడం లేదని తెలిపారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అవతలి వాళ్లెవరో తెలియదని, ఆ వీడియోలో అభ్యంతరకరంగా చూపించిన భాగంలో ఉన్నది మార్ఫింగ్ చేశారని మాధవ్ అంటున్నారని సజ్జల వివరించారు. మాధవ్ అంశంలో ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని, చంద్రబాబునాయుడు అంశంలో పెద్ద కేసే నడుస్తోందని పేర్కొన్నారు.
ఒరిజినల్ కాదే..?
మాధవ్ కు సంబంధించి ఒరిజినల్ బయటికి రాలేదని, ఆ వీడియోను ఇంకో వీడియోగా షూట్ చేసింది మాత్రం బయటికొచ్చిందని సజ్జల వెల్లడించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అన్నీ ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబు ఒక పార్టీకి అధినేత అని, మాజీ ముఖ్యమంత్రి అని, ఏదో సామాన్య కార్యకర్త కాదని తెలిపారు. ఎన్నికల వ్యవస్థనే భ్రష్టుపట్టించే విధంగా, రాజ్యాంగాన్నే అవహేళన చేసేవిధంగా వ్యవహరించారని విమర్శించారు.
చర్యలు తప్పవు
మాధవ్ తప్పు చేశాడని తేలితే చర్యలు ఉంటాయని ముందే చెప్పామని, జగన్ కూడా మాటపై నిలబడతారని సజ్జల పేర్కొన్నారు. వీడియో వ్యవహారంలో కొంచెం వేచిచూసినంత మాత్రాన కొంపలేమీ అంటుకుపోవు అని కామెంట్ చేశారు. అనేక అంశాలు ఉన్నాయని, వాటిపై దృష్టిసారిస్తే మేలని హితవు పలికారు. టీడీపీ వాళ్ల చిట్టా తీస్తే బూతుపురాణాలు చాలానే ఉన్నాయని, వాటిలోకి వెళ్లడం తనకు ఇష్టంలేదని సజ్జల పేర్కొన్నారు.