ఆ కులాన్ని అణచివెయ్యాలనే ఆలోచనే సీఎం జగన్ పతనానికి నాంది : గోరంట్ల ఫైర్
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వెయ్యటంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కమీషనర్ పై ఆరోపణలు చేశారు. కులాల ప్రస్తావన తెచ్చారు. దీంతో ఒక్క సారిగా ఏపీలో కుల రాజకీయాలు భగ్గుమన్నాయి. టీడీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఏపీ సీఎం కులాల ప్రస్తావన తెచ్చి మాట్లాడటంపై మండిపడుతున్నారు.

ఎన్నికల కమీషనర్ కు కులాన్ని ఆపాదించటం దారుణం
ఇక తాజాగా టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమీషనర్ కు కుల రాజకీయం అంటగట్టటం దారుణం అని మండిపడ్డారు . కమ్మ జాతిని అణచివేయాలనే ఆలోచనే ముఖ్యమంత్రి జగన్ను పతనం చేస్తుందని ఆయన నిప్పులు చెరిగారు. కరోనా ప్రభావంతో ఎన్నికలను వాయిదా వేస్తే చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టే చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ఎన్నికల కమీషనర్ కు కులాన్ని ఆపాదించటం అన్యాయం అని పేర్కొన్నారు.

జగన్ తమ సామాజిక వర్గానికే కీలక పదవులు ఇచ్చారని విమర్శ
సామాజిక వర్గాలను ప్రస్తావిస్తున్న జగన్ తమ సామాజిక వర్గానికే కీలక పదవుల్లో పట్టం కట్టారని ఆరోపించారు.కమ్మ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆరోపించారు. కమ్మ సామాజిక వర్గం ఏం అన్యాయం చేసిందని గోరంట్ల సీఎం జగన్ ను ప్రశ్నించారు . ఇలా కుల రాజకీయాలు చెయ్యటం తగదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని పేర్కొన్నారు. ఇక స్థానిక ఎన్నికల నేపధ్యంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు గోరంట్ల .

రాష్ట్రంలో జగన్ అధికార దుర్వినియోగం చేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడిన ఆయన వాలంటీర్లతో ఓటర్లను బెదిరించటం వంటి ఘటనలకు వైసీపీ పాల్పడింది అని ఫైర్ అయ్యారు. ఇక అడుగడుగునా అభ్యర్థులను ఇబ్బంది పెట్టారని ,పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఆయన ఆరోపించారు . పవన్ కళ్యాణ్ను పవన్ నాయుడు అని ఎందుకు పిలుస్తున్నారని గోరంట్ల ప్రశ్నించారు.
Recommended Video

కరోనా కంటే భయంకరమైన వ్యాధితో సీఎం జగన్ బాధపడుతున్నారని ఫైర్
కరోనా కంటే భయంకరమైన వ్యాధితో సీఎం జగన్ బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి కావటం సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యం అని ఆయన పేర్కొన్నారు. ఇసుక దోపిడీ చేస్తున్నారని, అక్రమాలకు కేరాఫ్ గా వైసీపీ నాయకులు మారారని , రాజమండ్రి నుంచి సూట్ కేసులు వెళ్లిపోతున్నాయని గోరంట్ల ఆరోపణలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి మళ్లీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని కోరిన గోరంట్ల జగన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications