విజయవాడలో 30న జగన్ ప్రమాణస్వీకారం.. ట్రాఫిక్ డైవర్షన్ ఎలా అంటే..!
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన వైసీపీ అధికారంలోకి రాబోతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన (గురువారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కీలక నేతలను ఆహ్వానించారు జగన్.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జగన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా దాదాపు 5వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది పోలీస్ శాఖ. అదలావుంటే ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా పలుచోట్ల వాహనాలను దారి మళ్లించనున్నారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ రానుండటంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వారి కాన్వాయ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గం సిద్దం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానం కేటాయించారు. అలాగే అధికారులు, వారి సిబ్బంది, సహాయకుల వాహనాలకు బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్ గెస్ట్హౌస్లో పార్కింగ్ కేటాయించారు.
విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట, వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చెన్నై మధ్య రాకపోకలు నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, అడవినెక్కలం, మేదరమెట్ల, ఒంగోలు మీదుగా సాగనున్నాయి.












Click it and Unblock the Notifications