మీ నివేదికలు సిద్ధం అయ్యాక మా అభ్యంతరాలు దేనికి ... హైపవర్ కమిటీ భేటీపై రాజధాని రైతుల ఆగ్రహం
ఏపీ రాజధాని విషయంలో ఏపీలో ఒకపక్క ఆందోళనలు కొనసాగుతుంటే మరోపక్క రాజధాని విషయంలో వేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ సిఫార్సులను అధ్యయనం చెయ్యటానికి వేసిన హై పవర్ కమిటీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యి రాజధాని అ విషయంలో అధ్యయనం చేసిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అంతే కాదు రాజధాని అమరావతి రైతుల విషయంలో కూడా సూచనా ప్రాయంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం . ఇక ఈ నేపధ్యంలో రాజధానిగా అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వం తన అభ్యంతరాలు అడగటం మరో మోసం అని మండిపడుతున్నారు.

సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికే హైపవర్ కమిటీ మొగ్గు
రాజధానిగా అమరావతి కావాలని రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం రాజధాని విషయంలో తరలింపు వైపే మొగ్గు చూపుతుంది. ఇక తాజాగా సీఎంతో భేటీ అయిన హై పవర్ కమిటీ కూడా సీఎం జగన్ నిర్ణయానికే మొగ్గు చూపింది . రాజధాని విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవటం కోసం జీఎన్ రావు కమిటీ నివేదికను, బోస్టన్ కమిటీ నివేదికను అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటీ తన నివేదిక విషయంలో రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంది .

నేటి సాయంత్రం వరకు రైతుల వినతులు తీసుకునే అవకాశం
రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలు నేటి సాయంత్రం వరకు తీసుకోవటానికి సమయం ఇచ్చినా అంతకంటే ముందే ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని రాజధాని ప్రాంత రైతులు హై పవర్ కమిటీపై మండిపడుతున్నారు.భూములు ఇచ్చిన రైతులు తమ విజ్ఞప్తులు ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు ఇవ్వటంతో ఇప్పటి వరకు 3100 రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక నేడు సాయంత్రం వరకు ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు.

రాజధాని రైతుల ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని రైతుల ఆగ్రహం
ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో రాజధాని రైతుల విజ్ఞప్తులను హైపవర్ కమిటీ పెద్దగా పట్టించుకునే అవాకాశం లేదనే అంశం తాజా భేటీతో అర్ధం అవుతుంది. రాజధానిని మార్చొద్దంటూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపిందంటున్నారు అమరావతి ప్రాంత రైతులు. మూడు రోజుల్లో రైతులు తమ అభిప్రాయాన్ని ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలంటూ సీఆర్డీఏ వైబ్ సైట్ ఏర్పాటు చేసిందని అయితే, ఈ వెబ్ సైట్ ఓ కొత్త నాటకమంటూ రైతులు మండిపడుతున్నారు.

అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం మరో మోసానికి తెరతీసిందన్న రైతులు
అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం మరో మోసానికి తెరతీసిందని విరుచుకుపడుతున్నారు. తమ అభిప్రాయం పరిగణనలోకి తీసుకుంటే రాజధాని అమరావతి మార్చరని వారు అంటున్నారు. ఏదో నామమాత్రపు అభిప్రాయ సేకరణ కాబట్టే తమ అభిప్రాయాలను పరిశీలించకుండానే రాజధాని విషయంలో హైపవర్ కమిటీ సీఎం జగన్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల వినతులు పరిశీలించక ముందే నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు
సీఆర్డీఏ రద్దు విషయాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు దాని స్థానంలో విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి అభివృద్ధి బోర్డును పునరుద్దరించాలని, దాని ద్వారా సీఆర్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టిన కమిటీ అందుకోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచించనున్నట్లు సమాచారం. ఇక ఈ అంశాలను బట్టి రాజధాని రైతులు తమ అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అడిగి తమను మోసం చేసిందని , తమకు ఇచ్చిన గడువు పూర్తి కాకుండానే నివేదిక సిద్ధం అయ్యిందని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications