జగన్ వద్ద మార్కులు కొట్టేస్తోన్న వసంత కృష్ణప్రసాద్..!!
మొన్నటివరకు స్తబ్దుగా ఉంటూ వచ్చిన కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ యాక్టివ్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోన్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసంతృప్తి పూర్తిగా చల్లారింది. తెలుగుదేశం పార్టీ వైపు చూపులు సారించారనే అభిప్రాయాన్ని కలిగించిన స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్.. ఇక చురుగ్గా వ్యవహరిస్తోన్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం తన వైఖరిని మార్చుకున్నారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై స్పష్టత రావడంతో ప్రజలతో మమేకమౌతోన్నారు.
పార్టీలోనే ఉంటానంటూ..
జగన్ ను కలిసిన అనంతరం వసంత కృష్ణ ప్రసాద్.. పార్టీలో కొనసాగడంపై తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీలోనే కొనసాగుతానంటూ స్పష్టం చేశారాయన. నియోజకవర్గంలో ఎదుర్కొంటోన్న ఇబ్బందులన్నింటినీ ఆయన వైఎస్ జగన్ కు వివరించారు. సొంత పార్టీ నేతలతో ఏర్పడ్డ విభేదాలు ఉన్నాయని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరిస్తానంటూ జగన్ హామీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
వైసీపీలో సైనికుడిగా పని చేస్తానంటూ..
వ్యక్తిగత అవసరాల కోసమో, స్వార్థ రాజకీయాల కోసమో పార్టీ ఫిరాయించాల్సిన అవసరం తనకు లేదంటూ అప్పట్లో వసంత కృష్ణప్రసాద్ తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నమ్ముకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడాయన కుమారుడి వెంటే ఉంటాననీ వివరించారు. పార్టీ బలోపేతానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, వైసీపీ సైనికుడిగా.. జగన్ ముఖ్య అనుచరుడిగా ఎప్పటికీ పార్టీలో ఉంటానని అన్నారు.
చురుగ్గా గడప గడపకు..
దీని తరువాత ఆయన నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మంగా భావిస్తోన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటోన్నారు. ప్రజలను నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి కలుసుకుంటోన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తోన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, జగనన్న చేయూత, పింఛన్లు.. వంటి వివిధ సంక్షేమ పథకాల కింద వారికి అందుతోన్న లబ్ది గురించి తెలియజేస్తోన్నారు.
బుజ్జగించడంలో..
గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణ ప్రసాద్ కు మనస్పర్థలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో అలిగిన వసంతను బుజ్జగించడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరహాలో వసంత కూడా పార్టీపై తిరుగుబాటు జెండా లేవదీస్తారంటూ మొదట్లో వార్తలొచ్చినప్పటికీ- అలా జరగలేదు.

అసంతృప్తులతో..
నియోజకవర్గ స్థాయిలో అసంతృప్త నేతలనూ జగన్ కలుసుకుంటోన్నారు. గ్రామస్థాయిలో వారు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటోన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్త వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారాయన. వసంత కృష్ణ ప్రసాద్ ను కూడా బుజ్జగించగలిగారు. ఆయనను పార్టీలోనే కొనసాగేలా చేయగలిగారు.












Click it and Unblock the Notifications