టిడిపి పై అవంతి ఎఫెక్ట్ : టిడిపి ఎంపీగా బరిలోకి బిగ్బాస్ కౌశల్..!
టిడిపి నుండి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసిపి లో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో భీమి లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగుతున్నారు. అవంతి వెళ్లిపోవటం తమకు ఎటువంటి ఇబ్బంది లేదని పైకి చెబుతున్నా అనకాపల్లి లోక్సభ సీటు కోసం తర్జన భర్జన పడుతున్నారు. అందులో భాగంగా విశాఖ నేతలంతా ఒకే చోట సమావేశమై కొత్త పేరును తెర మీదకు తీసుకొచ్చారు...
టిడిపి ఎంపీ అభ్యర్దులెవరు...
విశాఖ జిల్లాలో రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి. విశాఖ తో పాటుగా అనకాపల్లి లోక్సభ స్థానాల్లో టిడిపి నుండి ఎవ రు బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. మంత్రి గంటా నివాసంలో జిల్లాకు చెందిన టిడిపి నేతలు సమావేశమయ్యా రు. అయ్యన్న మినహా మిగిలిన నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా విశాఖ - అనకాపల్లి ఎంపి స్థానాలకు సంబంధించి వారు చర్చించారు. విశాఖ నుంచి కాపు లేదా ఇతర ఓసీ అభ్యర్థి పోటీలో దిగితే అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. బీసీ అయితే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తన కుమారుడు విజయ్కు టిక్కెట్ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు ఎప్పటినుంచో అధిష్ఠానాన్ని కోరుతున్నారు.
విశాఖలో బిసి అయితే..అనకాపల్లి లో కాపు..
ఇక విశాఖ నుంచి బీసీ అభ్యర్థి నిలబడాల్సి వస్తే గాజువాక ఎమ్యెల్యే పల్లా శ్రీనివాసరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. గతంలో ప్రజారాజ్యం తరపున విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన పల్లా మూడు లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. నియోజకవర్గ పరిధిలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు రాజకీయ ప్రాధాన్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. పల్లా శ్రీనివాసరావు విశాఖ నుంచి పోటీకి అవకాశం ఇస్తే అనకాపల్లి నుంచి కాపు సామాజిక వర్గ అభ్యర్థిని ఎంపిక చేయాలనే చర్చ వచ్చింది.
అనకాపల్లి నుండి ఎంపిగా బరిలోకి
కాపు అయితే ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా ఇటీవల బిగ్బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో మాజీ ఎంపి కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరటం దాదాపు ఖాయమైంది. ఆయనను అనకాపల్లి నుండి ఎంపిగా బరిలోకి దింపే అంశం పైనా చర్చ జరుగుతోంది. అయితే, కౌశల్ కు అవకాశం ఇవ్వటం ద్వారా ఆ సామాజిక ఓటర్ల ప్రభావం లోక్సభ పరిధిలో మొత్తంగా పార్టీకి కలిసి వస్తుందనే భావన వ్యక్తం అవుతోంది.