శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులు
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది . ఏపీలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేశారు.నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడి శిరోముండనం వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి నూతన్ నాయుడు పరారీలో ఉన్నారు .

ఉడిపిలో నూతన్ నాయుడును పట్టుకున్న పోలీసులు
నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ముంబైకి పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులకు ఆయన పట్టుబడ్డాడని విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా మీడియాకు వెల్లడించారు . శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తర్వాతనే ఆయనను అరెస్ట్ చేసినట్లుగా సి పి వెల్లడించారు. నూతన్ నాయుడు భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఇందులో నూతన్ నాయుడు పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది .

ఘటన జరిగిన నాటి నుండి పరారీలో నూతన్ నాయుడు
ఈ ఘటనతో నూతన్ నాయుడు భార్య మధు ప్రియను, శిరోముండనం సమయం లో ఉన్న, సహకరించిన మిగతా ఇంట్లో ఉన్న పని వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన రోజు 6 సెల్ఫోన్స్ సీజ్ చేశామని తెలిపారు. మధుప్రియ తో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇంట్లో ఘటన జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న నూతన్ నాయుడు తన భార్యను కేసునుండి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు .

భార్య మధుప్రియను తప్పించే యత్నం చేసిన నూతన్ .. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరుతో ఫేక్ కాల్స్
నూతన్ నాయుడు భార్య మధుప్రియను కేసు నుంచి తప్పించడం కోసం సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో పలువురు అధికారులకు ఫోన్ చేసి వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై మరో కేసు కూడా నమోదు చేశారు . దళిత యువకుడు శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో పని చేసి మానేసిన క్రమంలో సెల్ ఫోన్ పోయిందంటూ పిలిపించి అతనికి శిరోముండనం చేయించారని, దారుణంగా హింసించారు అని బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video

శిరోముండనం కేసులో సీరియస్ గా ఉన్న ఏపీ ప్రభుత్వం ... నూతన్ పాత్ర మేరకే అరెస్ట్
సిసిటివి ఫుటేజీ ఆధారంగాఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు పాత్ర ఉన్నట్టు గుర్తించి ఆయనను అరెస్టు చేశారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ క్రింద ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే . గతంలోనూ ఒక దళిత యువకుడి శిరోముండనం వ్యవహారం దేశ వ్యాప్త చర్చకు కారణం అయిన నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా ఉంది .












Click it and Unblock the Notifications