చెన్నై టు వైజాగ్: నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు: వంతెన గోడను ఢీ కొట్టి..
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు.
Recommended Video
విశాఖపట్నం జిల్లాలోని ఎస్ రాయవరం మండలంలో బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నానికి బయలుదేరిన ప్రైవేటు బస్సు.. మార్గమధ్యలో ఎస్ రాయవరం మండలంలో ప్రమాదానికి గురైంది. 16వ నంబర్ జాతీయ రహదారిపై వరాహ నదిపై నిర్మించిన వంతెనను దాటుతున్న సమయంలో అదుపు తప్పింది. వంతెన గోడను ఢీ కొట్టి, నదిలో బోల్తా కొట్టింది. ఆ సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సహా అయిదుమంది మాత్రమే ఉన్నారు. వారికి గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాయపడ్డ వారిని బస్సులో నుంచి వెలికి తీశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పినట్టయింది. తెల్లవారుజామున జేసీబీతో బస్సును నది నుంచి వెలికి తీశారు. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. డైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications