ఆటలు సాగవు గజపతిరాజు, అశోకపై విజయసాయి రెడ్డి నిప్పులు
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చరిత్రను వివరిస్తూనే.. విమర్శలు చేశారు. విజయనగరం గజపతిరాజుల చరిత్రను ప్రస్తావించారు. తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక అని వెల్లడించారు. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని వివరించారు.

ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలే..?
విజయరామ గజపతిలా వారు విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదని తెలిపారు. విజయరామ గజపతి... హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచం ఇచ్చి బొబ్బిలి కోటపై దొంగదెబ్బ కొట్టాడని చరిత్రను ఉదహరించారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు కూడా తండ్రి పీవీజీ రాజులా కాకుండా విజయరామ గజపతిలా మారాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

ఆటలు సాగవు..
ఇది 18వ శతాబ్దం కాదు... నీ ఆటలు ఇక సాగవు అశోక గజపతిరాజు.. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమిందారులు అని ఫైరయ్యారు. గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలు అని విమర్శించారు. ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బతీశారని చరిత్రను వివరించారు. అలాంటి గజపతులు ప్రజలను పీడించి, బ్రిటీష్ వారికి కప్పం కట్టేవారన్నారు.

ప్రజలను హింసించి..
స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వాళ్లతో కలిసి ప్రజలను హింసించారని విజయసాయి రెడ్డి చెప్పారు. పీవీజీ, ఆనంద గజపతిని కాదని పాత వారసత్వాన్నే కొనసాగిస్తున్నావా అశోక్? కప్పం చంద్రబాబుకు కడుతున్నావా... పప్పునాయుడుకా? ఎన్టీఆర్కు వెన్నుపోటుకు మీ పూర్వీకులే స్ఫూర్తా?" అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

చైర్మన్గా నియమించడంతో..
ఇటీవల మాన్సాస్, సింహాచలం దేవస్థానం ట్రస్టులకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజునే పునర్నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి వైసీపీ నేతలకు, అశోక్ గజపతిరాజుకు మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రధానంగా విజయసాయి రెడ్డి, అశోక గజపతి రాజు మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ విజయసాయి రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications