ఆ కలెక్టర్ స్టైలే వేరు .. సైకిల్ పై ములుగు కలెక్టర్ .. పనితీరుతో ప్రజలు ఫిదా
ములుగు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా పాలనలో తనదైన మార్క్ వేస్తున్నారు. పనితీరుతో ప్రజలను ఫిదా చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ఆయన పని చేస్తున్న తీరు స్థానిక ప్రజల మన్ననలు పొందుతోంది. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటూ ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉంటున్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఇక ఇంతకు ముందు కలెక్టర్ లకు భిన్నంగా , ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతూ నూతన కార్యక్రమాలు చేపడుతూ నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాలో తనదైన ముద్ర వేస్తున్నారు .
రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు అవుతున్న నేపథ్యంలో, ములుగు జిల్లాలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను పరుగులు పెట్టిస్తున్నారు.

30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో చురుగ్గా ములుగు కలెక్టర్ .. సైకిల్ పై 15 కిలోమీటర్ల ప్రయాణం
30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్తోపాటు జిల్లా ఉన్నతాధికారులను భాగస్వామ్యం చేస్తున్న ఆయన గ్రామాల్లో శ్రమదానం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. గ్రామ ప్రజలతో కలిసి పోతున్నారు. ఇక అంతే కాదు గోవిందరావుపేట మండలం మచ్చాపూర్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీతో కలిసి కలెక్టర్ 15 కిలోమీటర్ల మేర సైకిల్పై వెళ్లారు. అనంతరం గ్రామస్థులతో కలిసి చెత్తాచెదారాన్ని తొలగించారు. సామాన్యుల తో కలిసి ఓ ఐఏఎస్ అధికారి పని చేస్తున్న తీరు చూసి ములుగు జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇదే తరహాలో పని చేసిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి.. ఇప్పుడు కలెక్టర్ నారాయణ రెడ్డి
గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ములుగు ఉన్న సమయంలో అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి సైతం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో తన మార్క్ చూపించారు. పలుమార్లు ఒక్కరే తండాలను సందర్శించి రాత్రి వేళల్లో అక్కడే బస చేశారు. ఇప్పుడు తాజాగా కలెక్టర్ నారాయణ రెడ్డి సైతం తనదైన శైలిలో పనిచేస్తున్నారు.
ఇక ఇటీవల గోవిందరావుపేట మండలం రంగాపురం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ రైతులు వ్యవసాయ కూలీలు నాటు వేస్తుండడాన్ని గమనించిన తాను కలెక్టర్ అనే హోదా మరిచిపోయివారితో కలిసిపోయారు.

రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేసిన కలెక్టర్
సామాన్య కూలీలాగా వారితో కలిసి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను కూడా రైతు బిడ్డనేనని డిగ్రీ వరకు చదువుతూ వ్యవసాయ పనులు చేశానని రైతు కూలీలతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను కూడా ములుగు జిల్లాల సక్సెస్ చేయడానికి ఆయన అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. స్వయంగా తాను సైతం పలు కార్యక్రమాలలో గ్రామస్థులతో కలిసి పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications