పార్టీకి పునాదులు మీరే..! డోంట్ వర్రీ.. నేనున్నానంటూ తారక మంత్రం
Recommended Video
జనగామ : ఉద్యమాన్ని ఉరకలెత్తించి రాష్ట్రాన్ని సాధించిన ధీరోదాత్తుడు కేసీఆర్ అంటూ కొనియాడారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఎందుకివ్వరంటూ కేసీఆర్ తెగించి కొట్లాడారని గుర్తుచేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ కు వచ్చిన కేటీఆర్.. టీఆర్ఎస్ పుట్టుక ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఉద్యమాలకు గుండెకాయలాంటి వరంగల్ నుంచి పర్యటన ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
పనిచేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ లో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు కేటీఆర్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు వృధా కాదన్నారు. మెరుగైన పాలన అందించేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు లోక్సభ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 16 పార్లమెంట్ సెగ్మెంట్లలో గులాబీ జెండా రెపరెపలాడేలా పనిచేయాలని సూచించారు.
పునాదులు మీరే.. డోంట్ వర్రీ, నేనున్నా
14 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కేటీఆర్. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా పెంబర్తి నుంచి జనగామ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గెలుపు ద్వారా పాఠాలు నేర్చుకోవాలని.. ఓటమి ద్వారా గుణపాఠం తెలుసుకోవాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ ఎలక్షన్ల రిజల్స్ట్ తో నేతలకు గానీ, కార్యకర్తలకు గానీ అహంకారం రాకుండా చూసుకోవాలని కోరారు.
జిల్లాల్లో కార్యాలయాలు.. పార్టీశ్రేణులకు భరోసా
పార్టీ సంస్థాగత బలోపేతం కోసం అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్.. జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమనుకుంటే అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పార్టీ కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఆపదొస్తే.. పార్టీ కార్యాలయానికి వెళితే పరిష్కారం దొరుకుతుందనే భరోసా ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఫలాలతో పాటు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీ నిర్మాణం జరిగితే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. మంత్రులు కూడా ఇకపై జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని.. కార్యకర్తలకు ఎప్పటికప్పుడూ దిశానిర్దేశం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు.
అభివృద్ధి తారక మంత్రం
కేసీఆర్ ను పెద్ద కొడుకులా భావించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులంతా అండగా నిలిచారని అన్నారు కేటీఆర్. కులమతాల ప్రస్తావన లేకుండా టీఆర్ఎస్కే అన్నివర్గాల ప్రజలు ఓట్లేశారని చెప్పారు. వచ్చే ఆరు నెలల కాలంలో దేవాదుల ద్వారా జనగామలోని ప్రతి చెరువు నిండేలా కృషి చేస్తామని తెలిపారు. వరంగల్ కు దగ్గర్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.