లీడర్ ఓడిపోయాడని ఎగతాళి చేస్తే.. వేలు నరుక్కున్న అభిమాని
భూపాలపల్లి జిల్లా : అభిమానానికి అంతుండదేమో. తాము అభిమానించే వ్యక్తులను ఆరాధిస్తుంటారు ఫ్యాన్స్. అది సినిమారంగమైనా, రాజకీయమైనా.. నచ్చితే చాలు గుండెల్లో పెట్టుకుంటారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఘటన అభిమానానికి హద్దు లేదని నిరూపిస్తోంది. ఓ అభిమాని ఏకంగా చేతి వేలిని నరుక్కోవడం చర్చానీయాంశంగా మారింది.
భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గండ్ర సత్యనారాయణరావు అలియాస్ సత్తన్న పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే చిట్యాల మండలం భీష్మ నగర్ లో నివాసముండే చిట్ల మల్లేశ్ అనే యువకుడు సత్తన్న ఇమేజ్ తో ఉన్న ఎలక్షన్ టీ షర్ట్ వేసుకున్నాడు. దీంతో ఓడిపోయిన నాయకుడికి సంబంధించిన టీషర్ట్ ఎందుకు వేసుకున్నావని ఇతర పార్టీలకు చెందినవారు ఎగతాళి చేశారట.
మనస్థాపం చెందిన మల్లేశ్ తన ఎడమ చేతి వేలును గొడ్డలితో నరుక్కున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు స్థానిక వైద్యుడితో చికిత్స చేయించారు. అయితే గెలుపోటములకు సంబంధం లేకుండా తాను ఎల్లప్పుడూ సత్తన్న వీరాభిమానిని అంటూ ఆయన కోసం ఏమైనా చేస్తానంటున్నాడట మల్లేశ్.