అమెరికాలో శ్రీశ్రీ గేయ లహరి

తరువాత శ్రీశ్రీ సినీ ప్రస్థానం గురించి మద్దుకూరి విజయచంద్రహాస్ చేసిన బహుమాధ్యమిక ప్రదర్శన సభికులను విశేషంగా ఆకట్టుకొంది. మహాకవి సినీ ప్రవేశానికి నేపథ్యం, ఆయన పని చేసిన మొదటి చిత్రాలు, మొదలైన విశేషాలతొ ప్రారంభించి, శ్రీశ్రీ మార్కు విప్లవ గీతాలతో బాటు, ఆయన రచించిన ప్రేమగీతాలు, పద్యాలు,జావళి, హరికథ, బుర్రకథ మొదలైన విభిన్నరీతుల నుండీ ఉదాహరణలు ప్రదర్శిస్తూ సాహిత్యవిలువలు వివరిస్తూ,చంద్రహాస్, శ్రీశ్రీ పాటలలో సాహిత్యపరంగా బాగుండని పాటలు వెదికినా కనబడవనీ, సినిమారంగంలో ప్రవేశించినా మహాకవి స్థానాన్ని ఆయన వదలుకోలేదనీ శ్రీశ్రీకి నివాళి అర్పించారు.
తదనంతరం చేకూరి కేసీ, 'చీర లేక కోక" ప్రాచీనసాహిత్యంలోనూ, పురాణగాథల్లోనూ, అన్నమయ్య పదాల్లోనేగాక, అధునిక సాహిత్యంలో, కథల్లొ, సినీగేయాల్లొ ప్రధాన వస్తువుగా అనేకమార్లు కనిపిస్తుందని సోదాహరణంగా, వినోదాత్మకంగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా విచ్చేసిన బహుగ్రంథకర్త, నటుడు, అనువాదకుడు, కర్నాటాంధ్ర ద్విభాషారత్న గుత్తి చంద్రశేఖర రెడ్డి పద్యాలను జువ్వాడి రమణ పాడివినిపించారు. ముఖ్య అతిథిని ఊరిమిండి నరసింహారెడ్డి సభకు పరిచయంచేయగా, శ్రీమతి కన్నెగంటి మంజులత పుష్పగుఛ్చంతో స్వాగతం పలికారు.
అనంతరం చంద్రశేఖర రెడ్డి “సాహితీ సమరాంగణ సార్వభౌముడు – శ్రీ కృష్ణ దేవరాయలు" అనే అంశంమీద ప్రసంగిస్తూ రాయల వారిగురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. రాయల పూర్వీకులు కొంతకాలం తుళు ప్రాంతాన్ని పాలించడం వల్ల తుళువ వంశీకులు అనిపించుకున్నారనీ, కన్నడ రాజ్యాన్ని పాలించడం వల్లకృష్ణరాయలు కన్నడరాయడు అయ్యాడనీ ఐతే స్వతహాగా రాయల పూర్వీకులు తెలుగువారేననీ, రాయలు చూపరులను అకట్టుకునే చక్కని దరహాసవదనం కలవాడనీ, సంస్కృతంతో బాటు దక్షిణ భారత భాషలన్నింటిలొ పండితుడనీ,ఫారశీకం, పోర్చుగీసు తెలిసివాడనీ, వీణావాదన నేర్వడమేకాక క్లారినెట్ వంటి పాశ్చాత్యవాద్యాలలొ ప్రవేశం కలవాడనీ, రత్నపరీక్ష లొ నేర్పుగలవాడనీ, రైతుజన పక్షపాతి అనీ అన్నారు. అపజయం ఎరుగని మహావీరుడనీ, ఆడిన మాట తప్పని వాడనీ, అద్భుతమైన పరిపాలనాదక్షతగల చక్రవర్తి అనీ, ఆముక్త మాల్యదలొఆయన రాజనీతిజ్ఞత కు అద్దం పట్టే అనేక పద్యాలున్నాయనీ చెప్పారు. ఆయన రాజ్యంలొ ప్రజలు దొంగల భయం లేక నిర్భయంగా సంచరించేవారనీ, అంగళ్ళరతనాలు అమ్మడం దానికి నిదర్శనమనీ, అన్ని మతాలనూ గౌరవించేవాడనీ, దేవాలయాలతొ బాటు ఆయన కట్టించిన చర్చి, మశీదు ఇంకా ఉన్నాయనీ అన్నారు.
ఇంకా రాయల కావ్యరచన గురించి, యుధ్ధాలగురించీ, జీవితవిశేషాలగురించీ, ఎంతో సాధికారంగా వినోదభరితంగా ప్రసంగించి చంద్రశేఖర రెడ్డి, కృష్ణ దేవరాయలమీద తాను వ్రాసిన కొన్ని పద్యాలను చదివి తన ఉపన్యాసం ముగించారు. అనంతరం ముఖ్య అతిథిని, టాంటెక్స్, తానా నాయకత్వం శాలువతో, సాహిత్య వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించడంతొ సభ ముగిసింది.












Click it and Unblock the Notifications