ఛీ.. వాడసలు భర్తేనా?: దేశంకాని దేశంలో.. భార్యాబిడ్డలను వదిలేసి...
భూపాలపల్లి : కంటికి రెప్పలా చూసుకుంటానని నమ్మించి, పెళ్లి చేసుకుని.. తీరా ఇద్దరు కుమార్తెలు జన్మించాక దేశంకాని దేశంలో, అదీ దుబాయ్ తీసుకువెళ్లి భార్యను ఇద్దరు ఆడపిల్లలతో సహా కట్టుబట్టలతో నడిరోడ్డుపై వదిలేసిన భర్త ఉదంతమిది.
బాధితురాలు కట్టా స్వాతి అక్కా బావలైన మాదాల నాగమణి, రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాపురం మండల పరిధిలోని వెంగళరావుపేట గ్రామానికి చెందిన కట్టా స్వాతి ఏడేళ్ల కిందట హైదరాబాద్లోని ఒక బట్టల దుకాణంలో పని చేసేది.
అమెరికాలో తప్పిపోయిన.. భారత చిన్నారి కథ విషాదాంతం!?
ఈ క్రమంలో అక్కడే మహ్మద్ రఫీ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. స్వాతికి మాయమాటలు చెప్పి రఫీ ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే మహ్మద్రఫీ మరో మహిళను కూడా వివాహం చేసుకున్నట్లు స్వాతికి ఆలస్యంగా తెలిసింది.
దుబాయ్లో పని చేసుకుందామని నమ్మబలికి రెండు నెలల క్రితం మహ్మద్ రఫీ మొదటి భార్యతో పాటు, స్వాతిని కూడా తీసుకువెళ్లాడు. పదిరోజుల కిందట రఫీ తన మొదటి భార్యతో అక్కడినుంచి ఉడాయించాడు.
దీంతో అచేతన అవస్థలో ఉన్న స్వాతి గత పది రోజులుగా తన ఇద్దరు కుమార్తెలతో దుబాయ్ లో రోడ్ల వెంట తిరుగుతోంది. శనివారం సాయంత్రం స్థానికుల సహాయంతో ఆమె తన అక్క నాగమణికి ఫోన్ చేసి దేశంకాని దేశంలో తాను పడుతున్న అవస్థలను తెలియజేసింది. ఎలాగైనా దుబాయ్ నుంచి తనను, పిల్లలను ఇండియాకు తీసుకురావాలని కన్నీరుమున్నీరుగా విలపించింది.
ఏడాది కాలంగా కనీసం స్వాతి సమాచారం లేకపోవడంతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు స్వాతి పరిస్థితి ఏమిటో తెలిసి మరింత మనోవేదనకు గురయ్యారు. తన చెల్లిని ఇండియాకు తీసుకువచ్చే ఆర్థిక స్థోమత తమకులేదని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ స్పందించి తన చెల్లిని, ఆమె ఇద్దరు చిన్నారులను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. మాదాల నాగమణి ఫిర్యాదు మేరకు స్వాతి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కుమార్ తెలిపారు.