మే27 నుంచి 29 వరకు: నాటా సంగీత విభావరి
డల్లాస్: ప్రపంచం నలుమూలల నుండి ఎంతో ఉత్సుకతతో, ఆశక్తితో ఎదురు చూసే నాటా(నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) మహా సభలు డల్లాస్ మహానగరంలో మే 27, 28, 29 తేదీలలో జరగబోతోంది. ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా నాటా సంగీత విభావరిగురించి చెప్పుకోవాలి.
నాట సంగీత విభావరి కోసం నభూతో నభవిష్యతి అన్న రీతితో జరుగు తున్న ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. స్థానిక డల్లాస్ కళాకారులతో పాటు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు, గాయనీమణులు తమ గాంధర్వ రాగ గానామృతంతో సంగీత ప్రేమికుల మనసులు హత్తుకొనే పాటలతో వస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి, కోటి, రఘు కుంచె, ప్రవీణ్ లక్కరాజు ఆధ్వర్యంలో జరిగే సంగీత విభావరిలో, ప్రముఖ గాయని గాయకులు కల్పనా, మాళవిక, అంజన సౌమ్య, దినకర్, నూతన మోహన్, నరేంద్రలు పాల్గొని వీనుల విందైన మధుర గీతాలు అందిస్తారు.
ఇంత మంది ప్రముఖలు ఒక్క చోట చేరి అమెరికా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు, నాటా కన్వెన్షన్(నాటా తెలుగు మహాసభలు ), డల్లాస్ మహానగరం నడిబొడ్డున సమస్త సదుపాయాలతో పాటు హెలిపాడ్ సదుపాయం ఉన్న డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో మే 27 నుండి 29 వరకు జరగబోవడంతో అమెరికా, డల్లాస్ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ మహోన్నత కార్యక్రమానికి సంగీత అభిమానులు రోజలు, గంటలు లెక్కపెడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. మళ్లీ ఎన్నాళ్ళకు డల్లాస్ నగరానికి వస్తుందో చెప్పలేని నాటా కన్వెన్షన్ ను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించి, డల్లాస్ ప్రజలకు మధురానిభూతిని మిగాల్చాలి అని అహర్నిశలు కార్యకర్తలు విశేష కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలివచ్చి, ఈ మహా తెలుగు పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాటా మహా సభల సాంస్కృతిక కార్యక్రమాల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల నాయకుడు డాక్టర్ నాగి రెడ్డి దర్గా రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యవర్గ సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారు.
నాటా అద్యక్షుడు మోహన్ మల్లం, నాటా భవిష్య అద్యక్షుడు రాజేశ్వర్, నాటా మహా సభల సమావేశ నాయకుడు డాక్టర్ రమణ రెడ్డి గూడూరు, సమన్వయకర్త రామసుర్యా రెడ్డి సభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.