తెలంగాణ విమోచన వేడుకలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ డి.సి మెట్రో ప్రాంతంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. వర్జీనియాలోని తెలంగాణ ఎన్నారైలతో ఏర్పాటైన వర్జీనియా, తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ స్వాంతంత్ర్య దినోత్సవంగా జరిపారు.
1948, సెప్టెంబర్ 17న ఆనాటి హోంమంత్రి, ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ (తెలంగాణ) రాష్ట్రాన్ని ‘ఆపరేషన్ పోలో' పేరిట సైనిక చర్య చేపట్టి భారతదేశంలో విలీనం చేయబడింది. పటేల్ చొరవతో నిజాం ప్రభువు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు అంగీకరించారు. అప్పటి వరకు తెలంగాణ నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్ర్యం లభించింది.

అమెరికానిలోని తెలంగాణ ప్రాంత ఎన్నారైల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డి.సి మెట్రో ప్రాంతం వర్జీనియాలోని అక్షయ రెస్టారెంట్లో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై వారు చర్చించారు.
తెలంగాణ ఎన్నారై రామ్మోహన్ సూరినెని మాట్లాడుతూ.. 1947, ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలను నిజాం పాలకుల ఆధ్వర్యంలో రజాకార్లు తీవ్రంగా హింసించారని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ ఉండేది కాదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు, ఉప ప్రధాని పటేల్ చొరవతో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చారని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం తెలంగాణ ఎన్నారైలు 2నిమిషాలపాటు మౌనం పాటించారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్పించాలని, దీని ద్వారా విద్యార్థులకు చరిత్రపై అవగాహన పెరుగుతుందని వారన్నారు. మరో తెలంగాణ ఎన్నారై అశోక్ వాసం మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి కోసం ‘సాయుధ పోరాటం' చేసి ఎందరో తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డిలతోపాటు సుమారు 4వేల మంది తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాళోజీలాంటి తెలంగాణ మేధావుల గురించి ప్రస్తావించారు. కొమురం భీమ్, సుద్దాల హనుమంతు, దాశరథి, కాళోజీ, భీంరెడ్డి రాంరెడ్డిలు తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తీరును పవన్ గర్ల వివరించారు.
కార్యక్రమంలో తెలంగాణ కవులు, అమరవీరులకు నివాళులర్పించారు. గాజుల బుచ్చన్న మాట్లాడుతూ.. 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని అన్నారు. త్వరగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదించాలని తెలంగాణ ఎన్నారైలు డిమాండ్ చేశారు. సీమాంధ్రులు విభజన పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ప్రజలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాక ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రఘువర్మ, రమణారెడ్డి, కృష్ణ మోహన్ చిన్నాల, అనిల్ కాసినేని, రోహిత్, అవుదుపూడి, మల్లిక్ గోరెపల్లి, శ్యాం వీర్ల, రవీందర్ కొక్కిరాల, పున్నం జొన్నల, శ్రీధర్ సాన, శ్రీనివాస్ పాశం, శ్రీనివాస్ తాటిపాముల, సంతోష్ దోమకొండ, శ్రీధర్ మారం, జగదీష్, భువనేష్ బుజల, విజయ్ పాల్, సంతోష్ రెడ్డి, అనిల్ తాటికొండ, గిరిధర్ సాదు, రమణారెడ్డి, ధీరజ్ సింధిల్, సుధాకర్ చంగల్, వినయ్, విష్ణు మాధవరం, రాజేష్ మాదిరెడ్డి, శ్రీనివాస్ పిట్ల, లక్ష్మణ్, రమేష్, దీనా, సునీల్ ఉందెల, విష్ణు డియోలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications