Raavi Sastri: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమయంలోనే..!!
అమరావతి: రాచకొండ విశ్వనాథ శాస్త్రి.. రావిశాస్త్రిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్న సాహితీ వేత్త. ఉత్తరాంధ్ర మాండలీకంలో రచనలను సాగించిన భాషా పండితుడు. తన రచనల ద్వారా పీడిత వర్గంలో చైతన్యాన్ని నింపారు. సమాజాన్ని కదిలించారు. ఇండియన్ గోర్కీగా పేరు తెచ్చుకున్నారు. రావిశాస్త్రి జన్మించి ఈ ఏడాదికి వంద సంవత్సరాలు పూర్తవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆయన శత జయంత్యుత్సవాలను నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవలే విశాఖలో రావిశాస్త్రి స్మారకోపన్యాసం చేశారు.
1922 జులై 30వ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు జన్మించారు. వృత్తి రీత్యా న్యాయవాది. తండ్రి న్యాయవాది. తల్లి రచయిత. తండ్రి నుంచి న్యాయవిద్యను, తల్లి నుంచి సాహిత్యాన్ని అవపోషణ పట్టారు. రావి శాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తత్వ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1946లో మద్రాసు యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. వామపక్ష భావజాల ప్రభావం ఆయనపై ఉండేది. తన రచనల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. మాండలికాలను నిలబెట్టారు.
ప్రజలు, వారి ఇబ్బందులను తన కథావస్తువుగా చేసుకునే వారు. అడ్వొకేట్ కావడం వల్ల న్యాయ వ్యవస్థపైనా ఆయనకు మంచి పట్టు ఉండేది. న్యాయ వ్యవస్థపై కథలను రాశారు. సమాజాన్ని కదిలించేలా రాజ్యాంగాన్ని, సాధారణ వాడుక భాషలో అందరికీ అర్ధం అయ్యేలా తన కథలు, రచనల్లో వివరించేవారు. రావిశాస్త్రి రచనలను స్ఫూర్తిగా తీసుకున్నవారు చాలామందే ఉన్నారు. ఉత్తరాంధ్ర మాండలికంలో రావిశాస్త్రి రచనలు ఆ ప్రాంతం విశిష్ఠత పెంచాయి.
సమాజంలో ఎదురయ్యే ప్రతి అంశాన్నీ తన కథనల్లో వివరించేవారు. సమస్యలను ఎలా తీసుకోవాలో.. వాటిని ఎలా పరిష్కరించాలో తెలియజేసేవారు. కథాసాగరం, ఆరు సారా కథలు, రాచకొండ కథలు, రాజు మహిషి, కలకంఠి, బానిస కథలు, ఋక్కులు, ఆరు చిత్రాలు, రత్తాలు-రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులోస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు, నిజం, తిరస్కృతి, విషాదం వంటి రచనలు నాటికలు/నాటకాలను రాశారు.
తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన, ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి ఓ మైలురాయి వంటిది. అదే తరహా నవలలను చాలామంది రాశారు. రాజు మహిషీ, రత్తాలు-రాంబాబు అనే రెండు నవలలు అసంపూర్ణమైనవని సాహితీవేత్తలు చెబుతుంటారు. మద్య నిషేధ చట్టం తెచ్చి పెట్టిన తరువాత, దాని ఆధారంగా ఆరుసారా కథలను రాశారు. జీవిత చరమాంకంలో ఇల్లు అనే నవలను రాశారు. 1993 నవంబర్ 10వ తేదీన కన్నుమూశారు.