తెలంగాణాపై నైపాల్ దృష్టి
ప్రముఖ ఇండో-ఆంగ్లియన్ రచయిత వి.ఎస్.నైపాల్ దృష్టి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణాపై పడింది. ఆయన తెలంగాణాపై రచన చేసేందుకు ముడిసరుకును మూట కట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన నైపాల్ నక్సలైట్ల ప్రాబల్యం విపరీతంగా వున్న కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లాలోని గ్రామాలు కూడా తిరిగి ప్రజలను కలుసుకున్నారు. జిల్లా ఎస్పి నళినీ ప్రభాత్తో మాట్లాడారు. ఇతర పోలీసు ఉన్నతాధికారులతోనూ మాట్లాడారు.
ఇటు వైపు ప్రముఖ విప్లవ కవి వరవరరావును కూడా ఆయన కలుసుకున్నారు. నిజాం కాలం నాటి నుంచి ప్రస్తుత చంద్రబాబునాయుడు పాలన వరకు సంభవించిన సామాజిక పరిణామ క్రమాన్ని వివరించాల్సిందిగా నైపాల్ వరవరరావును కోరారు. వరవరరావు అనుభవాలను, పరిశీలనను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఫ్యూడల్ అణచివేత రాష్ట్రంలో రాజ్యహింసగా పరిణామం చెందిన క్రమాన్ని వరవరరావు నైపాల్కు వివరించారు. 'బూటకపు' ఎన్కౌంటర్లు జరుగుతన్న తీరును, ప్రపంచ బ్యాంక్ ఆదేశంతో చేపడుతున్న ఆర్థిక విధానాల ఫలితాలను వరవరరావు నైపాల్కు వివరించారు.
నైపాల్ కరీంనగర్ జిల్లాను రెండుసార్లు ఆదివారం, బుధవారం సందర్శించారు. ఆయన జిల్లా ఎస్పి నళినీ ప్రభాత్తో మాట్లాడారు. పీపుల్స్వార్ సైద్ధాంతిక దిగుజారుడు తనం గురించి నళినీ ప్రభాత్ నైపాల్కు వివరించారు. నక్సల్స్ విచక్షణారహితంగా హత్యలు చేస్తున్నారని, డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆయన ఆంగ్ల రచయితకు చెప్పారు. నక్సలైట్లపై భ్రమలు తొలగిపోతున్నాయని ఆయన నైపాల్తో అన్నారు.
రచన చేయడానికే నైపాల్ ఆ సమాచారమంతా సేకరిస్తున్నారని అంటున్నారు. ఆయన నిజాం పాలన నుంచి ఆధునిక యుగం వరకు తెలంగాణా సమాజం పరిణామం చెందిన తీరుపై పుస్తకం రాసే అవకాశాలున్నాయి. ఇందులో నక్సల్స్ ప్రస్తావన తప్పకుండా ఉండి తీరుతుంది.
భారత దేశానికి చెందిన నైపాల్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. లండన్లో కూడా ఎక్కువగా వుంటుంటారు. నైపాల్ మొదట నవలలు రాసినప్పటికీ తర్వాత్తర్వాత 'రాజకీయ, సామాజిక జీవన విధానం'పై వ్యాసాలు, పుస్తకాలు రాయడం ప్రారంభించారు. తెలంగాణాపై ఆయన రాయబోయే పుస్తకం ఎలా వుంటుందనేది ఆసక్తికరమైన విషయమే.












Click it and Unblock the Notifications
