చందమామపై మరో విఫల ప్రయోగం..మొత్తం బూడిదే
చందమామపై సరికొత్త ప్రయోగానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. జపాన్ కు చెందిన ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ పరిశోధనలకు పూనుకుంది గానీ.. దాన్ని విజయవంతంగా మలచుకోలేకపోయింంది. ఈ సంస్థ పంపించిన మూన్ ల్యాండర్ చంద్రుడిపై సజావుగా ల్యాండ్ కాలేకపోయింది. క్రాష్ ల్యాండింగ్ కు గురైంది.
చంద్రుడిపై ప్రయోగాలకు దిగిన ఆ సంస్థ.. ఐస్పేస్. హకుటో-ఆర్ మిషన్ 2 పేరుతో దీన్ని చేపట్టింది. చంద్రుడి ప్రయోగాలు చేయడానికి రిసైలెన్స్ అనే ల్యాండర్ ను పంపించింది. ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. ఈ తెల్లవారు జామున 3:17 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్ కావాల్సి ఉంది.

చందమామపై అత్యంత శీతల వాతావరణం ఉండే సీ ఆఫ్ కోల్డ్ (మేర్ ఫ్రిగోస్) వద్ద ఈ ల్యాండర్ ను ల్యాండ్ చేయాలనేది ఐస్పేస్ సంస్థ ఉద్దేశం. ఇది పూర్తిగా ఫ్లాట్ ప్లెయిన్. ఎటువంటి ఎత్తుపల్లాలు గానీ, లోయలు గానీ లేని ప్రదేశం ఇది. చంద్రుడి ఉత్తర భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని హెడ్ ఆఫ్ మూన్ గా పిలుస్తారు.
అత్యంత శీతలవాతావరణం ఉంటుందిక్కడ. పగటి సమయంలో 100 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటుది. చంద్రుడి ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. రాత్రి వేళ.. ఉష్ణోగ్రత మైనస్ లోకి పడిపోతుంది. సగటున మైనస్ 153 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది.
ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్నప్పుడు ల్యాండింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఈ ప్రక్రియ మొత్తం సజావుగానే సాగినప్పటికీ.. చివరి 10 నిమిషాల్లో తలకిందులైంది. ఉపరితలం నుంచి అయిదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయి. ఎటువంటి డేటా గానీ రిసైలెన్స్ నుంచి సేకరించలేకపోయింది ఐస్పేస్.
చంద్రుడి ఉపరితలానికి చేరువ అయ్యే సమయంలో దాని వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే అది క్రాష్ ల్యాండింగ్ కు గురై ఉంటుందని అంచనా వేసింది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ మిషన్ ముగిసిందంటూ ఐస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టకేషి హకమడ ప్రకటించారు. విఫలం కావడానికి గల కారణాలను అన్వేషిస్తోన్నామని తెలిపారు.
2023లో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్.. చంద్రుడిపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాని తరువాత మళ్లీ జాబిల్లిపై ఓ స్పేస్ క్రాఫ్ట్ ను పంపించడం ఇది రెండోసారి. ఇదివరకు బ్లూ ఘోస్ట్ అనే ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా అడుగు పెట్టగలిగింది.
అమెరికా టెక్సాస్కు చెందిన ఫైర్ ఫ్లై అనే సంస్థ దీన్ని పంపించింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్లో గల నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిందీ బ్లూ డ్రాగన్. మార్చిలో జాబిల్లిపై అడుగు మోపింది. ఆ ప్రయోగం విజయవంతమైంది.
చందమామపై గల మేర్ క్రీసియం ప్రాంతంలో బ్లూ ఘోస్ట్ ల్యాండ్ అయింది అప్పట్లో. మేర్ క్రీసియం అనేది ఓ బేసిన్. ఈశాన్య క్వాడ్రంట్ దిశలో ఉంటుందిది. దీని విస్తీర్ణం 740 కిలో మీటర్లు. 3.92 బిలియన్ సంవత్సరాల కిందట నెక్టేరియన్ యుగంలో ఇది ఏర్పడి ఉంటుందని నాసా గతంలో ప్రకటించింది.












Click it and Unblock the Notifications