రోహిత్ గౌరవంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందా? ఎం జరుగుతోంది?
Asia Cup 2025 India Squad: సెప్టెంబర్ 9వ తేదీన ఆరంభం కానున్న ఆసియా కప్ 2025లో ఆడబోయే భారత జట్టుపై అప్పుడే అసహనం, అసంతృప్తి చెలరేగింది. ఈ జట్టులో ఇద్దరు టీ20 స్పెషలిస్టులకు చోటు దక్కకపోవడమే దీనికి కారణం. ఉద్దేశపూరకంగానే వారిని ఎంపిక చేయలేదనే వాదనలు మొదలయ్యాయి.
మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ శుభ్మన్ గిల్ కు వైస్ కేప్టెన్సీ బాధ్యత అప్పగించారు. జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు.

ఈ జట్టులో- యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమౌతోంది. టీ20 ఫార్మట్ లో సాగే ఐపీఎల్ మ్యాచ్ లల్లో ఆడిన అపారమైన అనుభవం ఉన్నప్పటికీ వారిద్దరినీ ఎంపిక చేయపోవడం పట్ల మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి లెజెండరీ ప్లేయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. బీసీసీఐ నిర్ణయాలపై మండిపడుతున్నారు.
శ్రేయాస్ అయ్యర్, జైస్వాల్ ను జట్టులోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని, వారిద్దరికీ తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించాడు. జట్టు సెలెక్షన్ అనేది థ్యాంక్స్ లెస్ జాబ్ గా మారిందని విమర్శించాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన జైస్వాల్ ను తొలగించి శుభ్మన్ గిల్ను జట్టులోకి తీసుకువచ్చారని, అది సంతోషకరమే అయినప్పటికీ.. శ్రేయాస్, జైస్వాల్ ను పక్కనపెట్టడం సరికాదని అన్నాడు.
ఈ పరిస్థితుల మధ్య బీసీసీఐ కీలక ప్రతిపాదనలను తెర మీదికి తీసుకొచ్చింది. వన్డే ఫార్మట్ కు శ్రేయాస్ అయ్యర్ ను కేప్టెన్ గా నియమించాలని భావిస్తోంది. ప్రస్తుత కేప్టెన్ రోహిత్ శర్మను తొలగించి.. అతని స్థానంలో అయ్యర్ కు కేప్టెన్సీ పగ్గాలను ఇవ్వాలనే అంశంపై చర్చిస్తోన్నట్లు సమాచారం.

అదే సమయంలో టీ20 ఫార్మట్ కేప్టెన్సీలో కూడా భారీ మార్పులు చేర్పులు చేయడానికి బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సూర్యకుమార్ యాదవ్ ను తొలగించి అతని స్థానంలో వైస్ కేప్టెన్ శుభ్ మన్ గిల్ కు ఆ బాధ్యతలను అప్పగించడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఆసియా కప్ 2025 తర్వాత ఈ మార్పు ఉండొచ్చు.
మూడు ఫార్మట్లకు ఇద్దరే కేప్టెన్లు ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం వన్డేలకు రోహిత్ శర్మ, టీ20కి సూర్యకుమార్ యాదవ్, టెస్ట్ ఫార్మట్ కు శుభ్ మన్ గిల్ నాయకత్వాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. గిల్ కు టెస్టులతో పాటు టీ20 ఫార్మట్ సారధ్య బాధ్యతలను కూడా అప్పగించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఈ మార్పులకు తెర తీసినట్లు చెబుతున్నారు.
ఈ ప్రతిపాదనలపై రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. రోహిత్ శర్మను తప్పించే ప్రయత్నాలను విరమించుకోవాలని తేల్చి చెబుతున్నారు. INDIA NEEDS CAPTAIN ROHIT అనే ట్యాగ్ కింద వేల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ పదం ట్రెండింగ్ అవుతోంది. 75 వేలకు పైగా పోస్టులు పడ్డాయంటే అభిమానులు ఏ రేంజ్ లో దీన్ని వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications