కేప్టెన్గా బుమ్రా: ది బెస్ట్ టెస్ట్ టీమ్: తుదిజట్టు ఇదే..!!
Test Team Of The Year in 2024: భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆ దేశంతో అయిదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. నాలుగు మ్యాచ్లు ముగిశాయి. ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యతలో నిలిచింది. చివరిదైన అయిదో గేమ్ జనవరి 3వ తేదీన ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్.. దీనికి వేదిక.
మెల్బోర్న్లో నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత్ చవిచూసిన ఓటమి.. తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అభిమానులు జట్టుపై దుమ్మెత్తి పోస్తోన్నారు. ప్రత్యేకించి- కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై విరుచుకుపడుతున్నారు. వీరిద్దరూ కూడా రిటైర్మెంట్ కావాల్సిన సమయం వచ్చిందని, బీసీసీఐ వారిని సాగనంపకముందే గౌరవంగా వీడ్కోలు పలకాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్లల్లో భారత్ గెలిచింది ఒక్కటే. తొలి టెస్ట్ను విజయభేరి మోగించింది. ఆ మ్యాచ్లో జట్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కేప్టెన్గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ గైర్హాజరైన గేమ్ అది. అటు బౌలింగ్, ఇటు కేప్టెన్గా ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టును సమర్థవంతంగా విజయపథంలో నడపించగలిగాడు.
ఈ పరిణామాల మధ్య క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024ను ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా డ్రీమ్ టీమ్ ఇది. ఈ క్రికెట్ క్యాలెండర్లో టెస్టుల్లో అద్భుతంగా ఆడిన వివిధ దేశాల ప్లేయర్లతో కూడిన జట్టు ఇది. ఇలాంటి టీమ్ అంటూ ఒకటి రూపొందగలిగితే అది శతృదుర్భేధ్యంగా తయారవుతుందని, దాన్ని ఎవరూ ఓడించలేరని క్రికెట్ ఆస్ట్రేలియా అభిప్రాయపడింది.
ఈ జట్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కేప్టెన్గా నియమించింది. ఇందులో అటు రోహిత్ శర్మకు గానీ, ఇటు విరాట్ కోహ్లీకి గానీ చోటు దక్కకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బుమ్రా సహా మరో టీమిండియా ప్లేయర్కు మాత్రమే చోటు దక్కింది ఇందులో. టీమిండియా డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ 11లో ఉన్నాడు.
తుదిజట్టులో- యశస్వి జైస్వాల్ (భారత్), బెన్ డకెట్ (ఇంగ్లాండ్), జో రూట్ (ఇంగ్లాండ్), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా (కేప్టెన్- భారత్), జోష్ హేజిల్వుడ్ (ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్ (దక్షిణాఫ్రికా) ఉన్నారు.












Click it and Unblock the Notifications