ధోనీ వల్ల కూడా కాలేదు- సంజు రాసిన కొత్త రికార్డ్
IND vs BAN 3rd T20: బంగ్లాదేశ్తో జరిగిన చివరి టీ20 ఇంటర్నేషనల్లో దుమ్ము రేపింది భారత జట్టు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చెలరేగింది. ఈ ఫార్మట్లో ఏ జట్టు కూడా ఊహించని స్కోర్ సాధించింది. బుల్లెట్ల వంటి ఫోర్లు, భారీ సిక్సర్లతో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించింది.
క్లీన్ స్వీప్..
ఈ గెలుపుతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే 3-0 తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. అంతకుముందు జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ విజయకేతనాన్ని ఎగురవేసింది టీమిండియా. ఈ సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు టీ20ల్లోనూ అదే పరిస్థితి.

అత్యధిక స్కోర్..
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా- నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ను 164 పరుగులకే పరిమితం చేసింది. 133 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. టీ20 ఫార్మట్లో తిరుగులేదనే విషయాన్ని మరోసారి చాటి చెప్పింది.
బౌండరీలు, సిక్సర్ల హోరు..
టీమిండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన వాళ్లందరూ రెచ్చిపోయారు. సునామీలా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ కమ్ వికెట్కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఇన్నింగ్ హైలైట్. 47 బంతుల్లో ఎనిమిది భారీ సిక్సర్లు, 11 మెరుపుల్లాంటి బౌండరీలతో 111 పరుగులు చేశాడు.
మెరుపు ఇన్నింగ్..
సూర్యకుమార్ యాదవ్- 35 బంతుల్లో అయిదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 75, రియాన్ పరాగ్- 13 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో 34, హార్దిక్ పాండ్యా- 18 బంతుల్లో నాలుగు చొప్పున ఫోర్లు, సిక్సర్లతో 47 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది.
కొత్త చరిత్ర..
ఈ మ్యాచ్లో సెంచరీతో సంజు శాంసన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్కీపర్ బ్యాటర్ అతనే. ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ బ్యాటర్ కూడా ఈ ఫార్మట్లో సెంచరీ సాధించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ సైతం సెంచరీ కొట్టిన బ్యాటర్ల లిస్ట్లో చోటు దక్కించుకోలేదు.
ఇషాన్ కిషన్ రికార్డ్ కనుమరుగు..
ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో ఇషాన్ కిషన్ టాప్ పొజీషన్లో ఉండేవాడు. 2022లో శ్రీలంకపై అతను 89 పరుగులు చేశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సంజు శాంసన్ సునామీ ఇప్పుడది తుడిచి పెట్టుకుపోయింది.
సెంచరీలు చేసింది వీళ్లే..
కాగా- ఇఫ్పటిదాకా టీమిండియాకు చెందిన 10 మంది బ్యాటర్లు టీ20 ఇంటర్నేషనల్స్లో సెంచరీ చేశారు. రోహిత్ శర్మ- 5, సూర్యకుమార్ యాదవ్- 4, కేఎల్ రాహుల్- 2 సెంచరీలు కొట్టారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, సురేష్ రైనా, దీపక్ హుడా ఒక్కో సెంచరీ సాధించారు. ఈ జాబితాలో తాజాగా సంజు చేరాడు.












Click it and Unblock the Notifications