వాళ్లను ఇంటికి పంపి..నువ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నవ్ లే
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దూకుడు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్లల్లో జయభేరి మోగించింది. రెండు మ్యాచ్లు- రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ఏలో రెండో స్థానంలో నిలిచింది. సెమీ ఫైనల్స్కు అర్హత సాధించింది. ఈ గ్రూప్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్.. రేసు నుంచి తప్పుకొన్నాయి.
ఈ నెల 20వ తేదీన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది భారత్. ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్దేశించిన 228 పరుగులను 46.3 ఓవర్లలో కొట్టిఅవతల పడేసింది. శుభ్మన్ గిల్ నూటొక్క పరుగులతో చెలరేగిన గేమ్ అది.

ఈ నెల 23వ తేదీన తన మలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్కు చుక్కలు చూపించింది టీమిండియా. ఇక్కడా ఆరు వికెట్ల తేడాతోనే జయకేతనాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్దేశించిన 241 పరుగులను 42.3 ఓవర్లలోనే ఊదేసింది. టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడీ మ్యాచ్లో.
ఇక తన తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన. ఈ మ్యాచ్ ఈ ఆదివారం జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2:30 గంటలకు గేమ్ మొదలవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లూ కూడా సెమీ ఫైనల్స్కు అర్హత సాధించాయి. బంగ్లాదేశ్పై గెలిచిన తరువాత గ్రూప్ ఏలో అగ్రస్థానానికి ఎగబాకింది న్యూజిలాండ్.
గ్రూప్ ఏలో తొలి రెండు అగ్రజట్ల మధ్య మ్యాచ్ కావడం వల్ల దీనిపై అందరి దృష్టీ నిలిచింది. లీగ్ దశలో భారత్-న్యూజిలాండ్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. దీన్నీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు జట్లు కూడా. ఈ గేమ్తోనే లీగ్ దశ కూడా ముగుస్తుంది. మంగళవారం అంటే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది.
మ్యాచ్కు ఇంకా చాలా సమయం మిగిలివుండటం, సెమీ ఫైనల్స్కు అర్హత సాధించిన నేపథ్యంలో టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు దుబాయ్లో. కుమార్తె సమైరాతో కలిసి సిటీ మొత్తం చక్కర్లు కొట్టాడు. ఫొటోలకు ఫోజులిచ్చాడు. పాకిస్తాన్పై గెలవడం, ఆ జట్టు లీగ్ దశలోనే తప్పుకోవాల్సి రావడంతో గుండెల మీద భారం దిగినట్టయింది రోహిత్ శర్మకు.












Click it and Unblock the Notifications