రెండో ఇన్నింగ్ చాప చుట్టేసిన టీమిండియా: శ్రీలంకకు గెలుపు లక్ష్యం
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ పట్టు సడలించింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్లో లభించిన రికార్డు స్థాయి పరుగుల ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాస్త కుదురుకుంటే సొంతగడ్డపై ఛేదించగల టార్గెటే కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.
భారత రెండో ఇన్నింగ్స్ మెరుపువేగంతో సాగింది. మ్యాచ్ను తమ ఆధీనంలోకి తెచ్చుకునే క్రమంలో బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. లంక బౌలర్లు క్రమశిక్షణతో కూడిన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తూ భారత బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. వరుసగా వికెట్లను పడగొట్టారు. దీంతో భారత రెండో ఇన్నింగ్స్ కేవలం 193 పరుగుల వద్దే ముగిసింది. టీ20 తరహా బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 66 పరుగులు చేశాడు.

నాలుగో రోజు ఇన్నింగ్స్లో శ్రీలంక స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. స్పిన్ బౌలింగ్ కు పిచ్ సహకరించింది. దీన్ని అందిపుచ్చుకున్నారు లంక బౌలర్లు. భారత బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టారు. లంక స్పిన్ బౌలర్లు పిచ్ పై అనుకూల పరిస్థితులను వాడుకుంటూ భారత మిడిలార్డర్ను త్వరగానే దెబ్బతీశారు. ఫలితంగా భారత్ జోరుకు కళ్లెం పడింది. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్ ను సాధించగలిగారు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కేెఎల్ రాహుల్- 35, దేవ్ దత్ పడిక్కల్- 44, శుభ్ మన్ గిల్- 8, రిషభ్ పంత్- 66, జురెల్- 7, రవీంద్ర జడేజా- 9, మానవ్ సుతార్- 9, కుల్ దీప్ యాదవ్- 5, ప్రసిద్ధ్- 2, మహ్మద్ సిరాజ్ - 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇక్కడి పిచ్పై పగుళ్లు ఏర్పడి బంతి అనూహ్యంగా టర్న్ అవుతోండటం వల్ల 370కి పైగా పరుగులను అందుకోవడం అంటే ఏ బ్యాటింగ్ లైనప్కు అయినా కొండంత కష్టంగానే అనిపించవచ్చు.
భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాలంటే ఇప్పుడు లంక బ్యాటింగ్ను వీలైనంత త్వరగా కుప్పకూల్చాల్సి ఉంటుంది. టీమిండియా స్పిన్ విభాగంపైనే ఆశలు ఉన్నాయి. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ ఎంత మేర రాణిస్తారనే దానిపై టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్లు కూడా వారికి తోడైతే గెలుపు సులభతరమౌతుంది. సొంత పిచ్ కావడం శ్రీలంకకు కలిసి వచ్చే అంశం.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే లంక జట్టు పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్లాల్సి రావొచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవడానికి ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకం. లంక బ్యాటర్లు భారత బౌలింగ్ దాడిని తట్టుకుని నిలబడతారా లేదా టీమిండియా బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు పడగొట్టి భారత్కు అద్భుత విజయాన్ని అందిస్తారా అనేది ఉత్కంఠభరితంగా మారింది. ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.














Click it and Unblock the Notifications