భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!
భారత ఫుట్బాల్ జట్టుకు కేరళలోని కొచ్చిలో చేదు అనుభవం ఎదురైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం యాజమాన్యం, అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా టీమిండియా హెడ్ కోచ్, ఆటగాళ్లను స్టేడియం లోపలికి అనుమతించకపోవడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 క్వాలిఫయర్స్లో భాగంగా హాంగ్కాంగ్తో జరగనున్న మ్యాచ్కు ముందు నిర్వహించాల్సిన ప్రీ-మ్యాచ్ మీడియా సమావేశం సందర్భంగా ఈ హైడ్రామా జరిగింది. భారత జట్టు హెడ్ కోచ్ ఖలీల్ జమీల్, కొంత మంది ఆటగాళ్లతో కలిసి మీడియా సమావేశం కోసం స్టేడియానికి చేరుకున్నారు. అయితే కేరళ ఫుట్బాల్ అసోసియేషన్ స్టేడియం నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ ఇంకా జమ చేయలేదనే కారణంతో భద్రతా సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు
గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఈ అధికారిక విలేకరుల సమావేశం, అధికారుల నిర్లక్ష్యం వల్ల చివరి నిమిషంలో రద్దయింది. ఆటగాళ్లను గేటు వద్దే నిలిపివేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. భారత ఫుట్బాల్ చరిత్రలో 13 ఏళ్ల తర్వాత ఒక స్వదేశీ కోచ్ సారథ్యంలో జట్టు ఆడుతున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.

మ్యాచ్ యథాతథం
ఈ వివాదంపై ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. స్టేడియం అప్పగింత ప్రక్రియలో కొన్ని పరిపాలనాపరమైన అడ్డుంకులు ఎదురైన మాట వాస్తవమేనని.. అయితే మ్యాచ్ నిర్వహణకు ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. మార్చి 29 నాటికి స్టేడియం పూర్తిగా తమ నియంత్రణలోకి వస్తుందని.. షెడ్యూల్ ప్రకారం మార్చి 31న రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరుగుతుందని హామీ ఇచ్చింది.
కొచ్చి స్టేడియంలో కొత్తేమీ కాదు..
కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో కూడా కోచ్ డేవిడ్ కటాలా, ప్లేయర్ రోలిన్ బోర్గ్స్లను మీడియా గదిని ఖాళీ చేయాలని ఆదేశించి వివాదానికి తెరలేపారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కొచ్చిలో ఓ అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో ఇలాంటి నిర్వహణ లోపాలు బయటపడటం విమర్శలకు దారితీస్తోంది.












Click it and Unblock the Notifications