రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
Rohit Sharma and Virat Kohli retirement: టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్గా నిలిచిన చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ను రెండుసార్లు అందుకున్న రెండో జట్టు ఇదే. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే.
శనివారం రాత్రి బార్బడొస్లో జరిగిన ఫైనల్స్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగలు వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.

ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. క్రీజ్లో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ తరువాత విజృంభించాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్లోకి వచ్చిన అక్షర్ పటేల్ న్యాయం చేశాడు. 31 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్తో 47 పరుగులతో రాణించాడు.
చివర్లో శివం దూబే మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 16 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 27 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 170ని దాటింది. దక్షిణాఫ్రికా బౌలర్లల్లో కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్ట్జే రెండు చొప్పు. మార్కో జెన్సెన్, కగిసొ రబడ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
178 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా కూడా 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కుకున్నారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 70 పరుగులు జోడించారు. వారిద్దరూ అవుట్ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టనిపించింది గానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డు నిలిచాడు.
27 బంతుల్లోనే అయిదు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు. అతను ఉన్నంత సేపూ మ్యాచ్పై ఆశల్లేవు. 151 పరుగుల వద్ద క్లాసెన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రీజ్లో ఉండటం కలవరపాటుకు గురి చేసినా చివరి ఓవర్ తొలిబంతికి అతనూ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది.
కాగా- ఈ ఘన విజయంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. టీ20 ఇంటర్నేషనల్స్కు గుడ్ బై చెప్పారు. ఈ ఫార్మట్ నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించారు. తొలుత కోహ్లీ, ఆ తరువాత రోహిత్ శర్మ తమ నిర్ణయాలను వెల్లడించారు. ఐపీఎల్కు అందుబాటులో ఉంటారు.
ఇదే తన చివరి టీ20 ఇంటర్నేషనల్గా అభివర్ణించాడు రోహిత్ శర్మ. ఈ ఫార్మట్ నుంచి తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరక్కపోవచ్చని వ్యాఖ్యానించాడు. ఆడిన ప్రతి మ్యాచ్నూ ఎంతో ఎంజాయ్ చేశానని, ఈ ఫార్మట్లో ఆడిన ప్రతి క్షణాన్ని ప్రేమించానని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఆడానని, ఇప్పుడు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పాడు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత రిటైర్ కావాలని అనుకున్నానని, ఇప్పుడా నిర్ణయాన్ని తీసుకుంటోన్నానని విరాట్ కోహ్లీ చెప్పాడు. నెక్స్ట్ జనరేషన్ కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని పేర్కొన్నాడు. 2026 నాటి వరల్డ్ కప్ నాటికి అమేజింగ్ ప్లేయర్లు టీమిండియాలో ఉంటారని అన్నాడు.












Click it and Unblock the Notifications