వైయస్ జగన్ పై చంద్రబాబు కుట్ర?

సాక్షి మీడియా గత రెండు, మూడు రోజులుగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. వైయస్ జగన్ తాను 21, 22 తేదీల్లో నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే చంద్రబాబు కళ్లు తెరిచి, జగన్ ను దెబ్బ కొట్టడానికి 17వ తేదీ నుంచి తాను రైతు సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారని ఆరోపించింది. చంద్రబాబును రైతు వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ ఓ వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులు నష్టపరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయం దండుగ అని అన్నారని వైయస్ జగన్ కు చెందిన మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని, రైతులను నిర్లక్ష్యం చేసిన తీరుపై దుమ్మెత్తిపోసింది. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని వైయస్సార్ ప్రకటించినప్పుడు వ్యతిరేకించారని, కరెంట్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాయని అన్నారని, అటువంటి చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం దీక్ష చేస్తే ప్రజలు విశ్వసించబోరని వ్యాఖ్యానించింది. వ్యవసాయంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. చంద్రబాబు అలా అనలేదని, అలా వ్యవహరించలేదని ఎంతగా చెప్పినా నమ్మే పరిస్థితి లేదనేది సత్యం. ఆ వ్యాఖ్యలు రికార్డు అయి ఉన్నాయి.
కాగా, ఈ నెల 21వ తేదీ నుంచి వైయస్ జగన్ చేసే నిరాహారదీక్షకు ప్రజలు, రైతులు రాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు తన దీక్షను వాడుకున్నారని, చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సాక్షి డైలీ సోమవారం ఓ వార్తాకథనం ప్రచురించింది. చంద్రబాబు అరెస్టు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖాయమని, ఆ తర్వాత బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపు ఇస్తుందని, దాంతో జగన్ దీక్షా శిబిరానికి ప్రజలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని ఆరోపించింది. ఆ ప్రయత్నాలు ఎలా చేశారో ఆ వార్తాకథనం సవివరంగా తెలిపింది. వైయస్ జగన్ ఈ రకంగా అటు చంద్రబాబును, ఇటు కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications