చిరంజీవికి మెగా షాక్లు

కాంగ్రెసు రాజకీయాల రుచి చిరంజీవికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నట్లుంది. సి. రామచంద్రయ్యకు, గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెసు నాయకులు సి. రామచంద్రయ్యను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా గంటా శ్రీనివాస రావుకు కూడా కొలికి పెట్టారు. గంటా శ్రీనివాస రావుపై మైనింగ్ ఆరోపణలు ఉన్నాయని, అందువల్ల మంత్రి పదవి ఇవ్వకూడదని కొంత మంది కాంగ్రెసు నాయకులు పార్టీ అధిష్టానంతో చెప్పినట్లు సమాచారం. సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వడం సరి కాదని కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు వీరశివా రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. కడప జిల్లాలో తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాల్సి ఉందని, సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే జగన్ను ఎదుర్కోవడం సాధ్యం కాదని ఆయన అంటున్నారు.
అదే సమయంలో చిరంజీవికి రాష్ట్రంలోనే మంత్రి పదవిని ఇవ్వాలనే వాదనను కూడా ముందుకు తెస్తున్నారు. చిరంజీవికి రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలనే వాదనను ముందుకు తేవడం ద్వారా రామచంద్రయ్యకు మంత్రి పదవి దక్కకుండా చూడాలనే వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీలో చిరంజీవి పాత్రను పరిమితం చేయాలనే వ్యూహం కూడా అందులో ఇమిడి ఉన్నట్లు చెబుతున్నారు. వీరి వాదనకు అుగుణంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను మాత్రమే చేర్చుకోవడానికి మంత్రి వర్గ విస్తరణ చేయాలనే అధిష్టానం సూచనకు ఆయన విరుగుడు కనిపెట్టారు. మొత్తం మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ జరగాల్సి ఉంటుదని, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇస్తే అసమ్మతి చెలరేగే ప్రమాదం ఉందని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన చిరంజీవి రాజకీయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీ విలీనం సాంకేతికంగా పూర్తయిన తర్వాతనే ఆ పార్టీ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఉంటాయని ఆయన చెప్పారు. తద్వారా వారికి మంత్రి పదవులు ఇచ్చే అంశాన్ని మరింత కాలం వాయిదా వేయగలిగారు. చిరంజీవికి ఏదో ఒక పదవి ఖాయమైతే తప్ప ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను మంత్రి వర్గంలోకి తీసుకోకూడదనే ఎత్తుగడను కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్నారు. ఈ కాంగ్రెసు అంతర్గత రాజకీయాలను ఎదుర్కుని పార్టీలో తన ప్రత్యేకతను చాటుకోవడానికి చిరంజీవి కాకలు తీరిన రాజకీయ నాయకుడిగా ఎదగాల్సిన అవసరం ఇంకా ఉందని అనిపించక మానదు.












Click it and Unblock the Notifications