వివాదం: బూట్లతోనే షర్మిల ఈద్గాలో దువా

మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిల బడన్నపల్లికి సమీపంలోనే 'ఈద్గా' ప్రార్థనా ప్రదేశం కనిపించిందని, ఆ రోజు బక్రీద్ అన్న విషయం గుర్తుకు వచ్చిందని, అంతే.. షర్మిల అడుగులు అటువైపు సాగాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. పాదయాత్ర కోసం ధరించిన బూట్లతోనే దువా (ప్రార్థన) ముగించారు. ఆ సమయంలో ఆమె వెంట వైసీపీ పార్టీకి చెందిన పలువురు మైనారిటీ నాయకులు కూడా ఉన్నారు.
వివాదం ముదరకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు గానీ, షర్మిలతో ప్రకటన చేసేందుకు గానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రయత్నించలేదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. తిరుమల పవిత్రతకు ఆమె అన్న, వైయస్ జగన్ అపచారం తలపెట్టారన్న వివాదం సమసిపోకముందే, ఆయన సోదరి దాదాపు అలాంటి వివాదంలోనే చిక్కుకోవడం విశేషం. సంప్రదాయానికి విరుద్ధంగా షర్మిల కొందరు ముస్లింలతో కలిసి ప్రార్థన చేయడాన్ని ముస్లిం మైనారిటీ వర్గాలు తప్పుబట్టాయి. మరోసారి ముస్లిం మనోభావాలను దెబ్బతీయవద్దని తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు లాల్ జాన్ బాషా హెచ్చరించారు.
రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టవద్దని, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని బేషరతుగా ఆమె క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత ఖలీకుల్లాఖాన్ డిమాండ్ చేశారు. కాగా అసలు వివాదమేమీ లేదన్నట్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
పైగా, గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా మత అపచారానికి పాల్పడ్డారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాదించే ప్రయత్నం చేస్తున్నారు. హిందూపురం శాసనసభ్యుడు అబ్దుల్ ఘని సమక్షంలోనే గతంలో చంద్రబాబు బూట్లతోనే ఖురాన్ను అందుకున్నారని అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాలార్బాషా చెప్పుకొచ్చారు.షర్మిల బూట్లతో ఈద్గాలో ప్రార్థనలు చేసిన దృశ్యాలను ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రసారం చేసింది.












Click it and Unblock the Notifications