వైయస్ జగన్కు నారా లోకేష్ ధీటు వస్తారా?
నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ ఆటంకాలు కూడా తొలగిపోయినట్లు భావిస్తున్నారు. దీంతో నారా లోకేష్ అంతర్గత సమస్యలను పక్కన పెట్టేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ముందుకు దూకబోతున్నట్లు చెబుతున్నారు. యువరక్తాన్ని తెలుగుదేశం పార్టీకి నింపి దూకుడుగా సాగడానికి ఆయన సమాయత్తమైనట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ పార్టీని స్థాపించుకుని, మందీమార్బలాన్ని సమకూర్చుకుని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఒక రకంగా, ఆ రెండు పార్టీలకు ఆయన కొరకరాని కొయ్యగానే తయారయ్యారు. కాంగ్రెసు రాజకీయాలు కూడా వైయస్ జగన్ చుట్టే తిరుగుతున్నాయి. ఆయనకు కళ్లెం వేయడం ఎలాగో తెలియక కాంగ్రెసు అధిష్టానం సైతం సతమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా జగన్ రాజకీయ ప్రాబల్యానికి ఉక్కిరి బిక్కిరి అవుతుందనే చెప్పాలి. ఈ స్థితిలో నారా లోకేష్ జగన్కు పోటీ ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
నారా లోకేష్ ద్వారా యువత వైయస్ జగన్ వైపు వెళ్లకుండా నిరోధించాలనే ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ తెర తీసినట్లు భావిస్తున్నారు. జగన్ తన వ్యవస్థను తాను ఏర్పాటు చేసుకోగా, ఇది వరకే ఏర్పాటైన వ్యవస్థ లోకేష్కు ఉంది. పైగా, వ్యూహరచనలో దిట్ట అయిన చంద్రబాబు అండదండలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసులో ఏది చేయాలన్నా జగన్ తన మీద తానే ఆధారపడాల్సి న పరిస్థితి. పైగా జైలులో ఉన్నారు. ఈ స్థితిలో జగన్ కన్నా నారా లోకేష్కు అదనపు సౌకర్యాలున్నాయి.
అయితే, వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు జగన్కే ప్రజా మద్దతును సమకూర్చి పెడుతున్నాయి. నారా లోకేష్కు స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం అంది వస్తుందనేది సందేహమే. చంద్రబాబు వారసత్వం ఆయనకు లభిస్తుంది గానీ తాత ఎన్టీఆర్ వారసత్వం లభించే అవకాశాలు లేవు. ఏమైనా, నారా లోకేష్ జగన్ను ఏ విధంగా ఢీకొంటారనేది వేచి చూడాల్సిందే.