వార్తాకథనం: కెటిఆర్ సవాల్, రాధాకృష్ణ సై

'గిదేంది రామన్నా'... అనే శీర్షికతో ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి వార్తాకథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. నిరాధారమైన ఆరోపణలతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేస్తోందని కెటి రామారావు విమర్శించారు. తన నుంచి వివరణ కూడా తీసుకోకుండా కథనాలను ప్రసారం చేయడమేంటని ప్రశ్నించారు.
'ఏబీఎన్' అంటే 'ఆంధ్రా బ్లాక్ మెయిలింగ్ నెట్వర్క్' అని తెలంగాణవాదులు భావిస్తారని, దాన్ని మరోసారి నిజం చేశారని ఆరోపించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీడీపీకి అధికారిక మీడియాగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. పచ్చ పత్రికకు లోకమంతా పచ్చగానే కనిపిస్తోందా? అని రాధాకృష్ణను ప్రశ్నిస్తున్నానని అన్నారు.
తనపై వచ్చిన కథనాలు అవాస్తవమని గురువారం ప్రచురించకపోతే పరువు నష్టం దావా వేయడం నూటికి నూరు పాళ్లు ఖాయమని హెచ్చరించారు. రాధాకృష్ణ లాంటి మీడియా భయపెడితే తాను భయపడనని, తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు.
కెటిఆర్పై వేసిన కథనానికి కట్టుబడి ఉన్నామని, పరువునష్టం దావా వేయడానికి శుక్రవారందాకా వేచి చూడక్కర్లేదని రాధాకృష్ణ అన్నారు. తక్షణం దావా వేసుకోవచ్చునని ఆంధ్రజ్యోతి సవాల్ చేసింది. ఇద్దరు బిల్డర్ల మధ్య తలెత్తిన వివాదంలో కేటీఆర్ జోక్యం వాస్తవమనేందుకు అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని, కథనాన్ని ఆపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారని అన్నారు.
నిజానికి ఏబీఎన్ తొలుత కేటీఆర్ పేరు నేరుగా ప్రస్తావించనే లేదని, శ్రీనివాసరావు, ఆయన కుమార్తెలు, సతీశ్ రెడ్డి సోదరుడు కేటీఆర్ పాత్ర గురించి వివరించిన తర్వాతే వారి కథనం ప్రకారమే కేటీఆర్ పేరు ప్రస్తావించాల్సి వచ్చిందని రాధాకృష్ణ అన్నారు. తమ వద్ద అన్నింటికీ ఆధారాలున్నాయని, కేటీఆర్తో పరిచయమున్నట్లు సుబ్బారెడ్డి స్వయంగా అంగీకరించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications