త్యాగం, అనుకూలం: రాజధాని కోసం పట్టు
హైదరాబాద్: ఓ వైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతుంటే... మరోవైపు సీమాంధ్రలో కొత్త రాజధాని పైన నేతల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు ప్రాంతాల నేతలు తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలంటే, తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అప్పుడు తాము కర్నూలు రాజధానిని కోల్పోయామని, త్యాగాలు చేశామని, ఇప్పుడు తమ ప్రాంతానికే రాజధాని కావాలని సీమ నేతలు వాదిస్తున్నారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని ఈ ప్రాంత నేతలు చెబుతున్నారు.

మద్రాసు నుంచి విడిపోయినప్పటి నుంచి రెండుసార్లు రాజధాని విషయంలో నష్టపోయామని, కొత్త రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని సీమ నేతలు పట్టుబడుతున్నారు. మంత్రులు టిజి వెంకటేశ్, ఏరాసు ప్రతాప రెడ్డి, అహ్మదుల్లాతోపాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పదిహేను మంది దీనిపై దృష్టి కేంద్రీకరించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
రాజధానికి అవసరమైన రోడ్లు, రైల్వే, విమానాశ్రయం, ఇతరత్రా మౌలిక సదుపాయాలు తిరుపతిలో ఉన్నాయని లేదంటే కోస్తాంధ్ర, సీమకు మధ్యస్థంగా ఉండే ప్రకాశం జిల్లాలోనైనా రాజధాని ఏర్పాటుకు కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వాన్పిక్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించుకోవచ్చుననే వాదన ఎప్పటి నుంచో ఉంది.
మొదట మద్రాసు నుండి విడిపోయినప్పుడు సీమకు కర్నూలును రాజధానిని చేశారు. ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసినప్పుడు కర్నూలు నుండి రాజధాని హైదరాబాదుకు మారింది. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పుడు సీమ వాసులకు రాజధాని గురించి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గుంటూరు - విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేసేలా ఆ ప్రాంత ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాల పరంగా అత్యుత్తమమైనదని, అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని చెబుతున్నారు.
కాగా, కొత్త రాజధాని ఏర్పడితే పాలనాపరమైన కేంద్రంగా కాకుండా ప్రజలు, పరిశ్రమలు, ఇతరత్రా రంగాలకు చెందిన భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. సీమాంధ్రలో పెద్ద నగరాల విషయానికి వస్తే... విశాఖప, తిరుపతి, విజయవాడ తదితర పట్టణాలున్నాయి.












Click it and Unblock the Notifications