ప్చ్..!: ఎమ్మెల్యేల, మంత్రులపై కెసిఆర్ రహస్య సర్వే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజకవర్గాలలో రహస్యంగా సర్వే నిర్వహించారని తెలుస్తోంది. ఈ సర్వేల్లో ముప్పై శాతం మంది ప్రజాప్రతినిధుల పైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కెసిఆర్ గుర్తించారని తెలుస్తోంది.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలలోను కెసిఆర్ రహస్య సర్వే చేయించారని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కెసిఆర్ పైన ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్లో సానుకూలంగా ఉంది.
కెసిఆర్తో పాటు మంత్రులు కెటి రామారావు, హరీష్ రావుల పని తీరు పైన కూడా వారి వారి నియోజకవర్గాలలో సానుకూలత ఉంది. కెటిఆర్ సిరిసిల్ల నుంచి, హరీష్ రావు సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రుల్లో అయిదుగురు పట్ల వారి నియోజకవర్గ ప్రజల్లో అసహనం ఉందని సర్వేలో తేలినట్లుగా సమాచారం.
వారికి బిలో యావరేజ్ మార్కులు వచ్చాయి. అయితే, తెరాస ప్రభుత్వం ఇమేజ్ మాత్రం ప్రజల్లో పెరిగింది. మొత్తంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 30 నుంచి నలభై శాతం మంది పట్ల వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలిందని సమాచారం.
వారు తమ పని తీరును మెరుగుపర్చుకోకుంటే 2019 ఎన్నికల్లో కెసిఆర్ మళ్లీ సీట్లు ఇవ్వడం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, పనితీరు బాగా లేని ఎమ్మెల్యేల పైన కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రూడ్ బిహేవియర్, సరిగా పని చేయకపోవడం, ఎక్కువగా నియోజకవర్గాల్లో ఉండకపోవడం, అవినీతి, ప్రతి విషయంలో మంత్రుల తనయులు లేదా ఎమ్మెల్యేల ప్రమేయం, సెటిల్మెంట్లు, ఇసుక మైనింగ్ తదితర అంశాల్లో వారి తీరు పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తేలిందని సమాచారం. కెసిఆర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, సరిగా పని చేయని వారి లిస్ట్ మాత్రం తెలియరాలేదు.