జెసి బ్రదర్స్ కట్టడిపై చేతులెత్తేసిన చంద్రబాబు?
కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు విపరీతమైన స్వేచ్ఛను అనుభవించిన జెసి సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారట.
అనంతపురం: బహుశా తొలిసారి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకటమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లు కనిపిస్తున్నారు. జెసి బ్రదర్స్ను కట్టడి చేయలేక ఆయన చేతులెత్తేసినట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు విపరీతమైన స్వేచ్ఛను అనుభవించిన జెసి దివాకర్ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
క్రమశిక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వారిని కట్టడి చేయలేక సతమతమవుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా వారిని ఏమీ అనలేకపోతున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలే చెబుతున్నారు.
చంద్రబాబు వద్ద పనులు కూడా వారికి సజావుగానే సాగుతున్నట్లు చెబుతున్నారు. జెసి సోదరుల వైఖరి అనంతపురం జిల్లాలోని ఇతర తెలుగుదేశం పార్టీల నేతలకు మింగుడు పడడం లేదని అంటున్నారు. అనంతపురం జిల్లాకు కావాల్సిన పనులన్నీ జెసి సోదరులు చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇలా తెలుగుదేశం పార్టీలోకి..
చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జేసీ సోదరులు 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం నచ్చక వారిద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి... తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు.

పరిటాల సునీత వ్యతిరేకించినా...
జెసి సోదరులను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనను ప్రస్తుత మంత్రి పరిటాల సునీత తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి, జెసి కుటుంబానికి మధ్య బద్ధ వైరం కొనసాగుతూ వచ్చింది. ఎన్నికల్లో పార్టీ నుంచి అత్యధికులను గెలిపించుకోవాలనే ఏకైకా లక్ష్యంతో పరిటాల సునీతను ఒప్పించి జెసి సోదరులను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు.

చాలా మందే గెలిచారు...
జెసి సోదరుల వల్ల అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చాలా మందే విజయం సాధించారని అంటారు. అయితే, జేసీ సోదరులు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.అనంతపురం జిల్లా రైతాంగానికి చిన్న ట్రాక్టర్లను లెక్కకు మించి ఇప్పించుకోవడంలో జేసీ సోదరులు చాతుర్యాన్ని ప్రదర్శించారని చెబుతారు.

పంతం పట్టి రోడ్ల విస్తరణ...
కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్డు విస్తరణను జెసి సోదరులు పంతం పట్టి చేయించుకున్నారనే మాట జిల్లాలో వినిపిస్తోంది. ఈ వ్యవవహారంపై జేసి సోదరులు టిడిపి శానససభ్యుడు ప్రభాకర చౌదరితో మాటల యుద్ధానికి కూడా దిగారు. జెసి దివాకర్ రెడ్డికి చంద్రబాబు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని చెబుతున్నారు.

మరీ పంతం పట్టి..
ఇటీవల వ్యవసాయ, హార్టికల్చర్ కళాశాలలకు నోటిఫికేషన్ జారీ అయింది. జేసీ దివాకర్రెడ్డితో పాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నారు. జెసి దివాకర్ రెడ్డి దరఖాస్తుతో పర్యవేక్షణ కమిటీ సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. దీంతో ఆయన చంద్రబాబుపై ఒత్తిడి పెట్టి పాత నోటిఫికేషన్ను రద్దు చేయించి కొత్తగా నోటిఫికేషన్ను జారీ చేయించారని మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications