ఆటోమేషన్ ప్లస్ విదేశాల్లో స్థానికత ఒత్తిళ్లు: తగ్గుతున్న క్యాంపస్ సెలెక్షన్లు
సివిల్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సుల్లో ఏ కోర్సు అభ్యసించినా.. అధికశాతం ఇంజినీరింగ్ విద్యార్థులు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుంటారు.
హైదరాబాద్: సివిల్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సుల్లో ఏ కోర్సు అభ్యసించినా.. అధికశాతం ఇంజినీరింగ్ విద్యార్థులు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుంటారు. క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగ నియామకాలు జరిగే కళాశాలల్లోనే చదివేందుకు విద్యార్థులు ఇష్ట పడతారు. ఆయా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కూడా కొత్త విద్యార్థులను ఆకర్షించడానికి క్యాంపస్ సెలెక్షన్లనే ప్రామాణికంగా చెప్తున్నాయి. అయిదారేళ్ల క్రితం పలు ఐటీ కంపెనీలు ఆయా కాలేజీల్లో క్యాంపస్ల్లో సెలెక్షన్లు జరిపిన భారీగా కొత్త ఉద్యోగులను (ఫ్రెషర్లు) నియమించుకునేవి. ముందే తమ నియామక ప్రణాళికలను ప్రకటించేవి కూడా. ప్రతియేటా అక్టోబర్ నెలల్లో మొదలయ్యే క్యాంపస్ సెలక్షన్ల ప్రక్రియ ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది.
ఏడెనిమిదేళ్ల క్రితం కంపెనీలు ప్రాజెక్టులను సంపాదించడానికి బెంచ్ని చూపించేవి. కొన్ని కంపెనీల్లో మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 30 - 40 శాతం మంది బెంచ్పైనే ఉండేవారు. కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టి కొత్తగా నియమించిన ఉద్యోగులకు ఒకటి రెండేళ్లపాటు పెద్దగా పని చెప్పేవారు కాదు. వీరంతా బెంచ్పైనే ఉండేవారు. నియామకాల సమయంలో వారిలో సాఫ్ట్వేర్ నైపుణ్యానికంటే.. హేతుబద్ధ ఆలోచన విధానం (లాజికల్ థింకింగ్) ఉందా అన్న కోణంలో పరిశీలించి ఉద్యోగాలు ఇచ్చేవారు.

ఐదారేళ్ల క్రితం లక్ష మంది క్యాంపస్ సెలెక్షన్
కంపెనీలో చేరిన తర్వాత వారికి శిక్షణ ఇచ్చేవారు. విద్యార్థులు కూడా ఆఫర్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరాలా లేక పై చదువులకు వెళ్లాలా అని ఆలోచించేవారు. ఆఫర్లు పొందిన వారిలో దాదాపు సగానికి సగం మంది వచ్చి చేరేవారు కాదు. అందుకని కంపెనీలు కాలేజీలకు వెళ్లి భారీ సంఖ్యలో క్యాంపస్ సెలెక్షన్లు నిర్వహించేవి. అయిదారేళ్ల క్రితం ప్రోగ్రామర్లు, సాంకేతిక మద్దతు సేవల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే పలు కంపెనీలు సుమారు లక్ష మంది ఉద్యోగులను నియమించుకునేవని సమాచారం.

తగ్గుతున్న క్యాంపస్ సెలక్షన్లు
క్రమంగా సాఫ్ట్వేర్ పరిశ్రమలో వస్తున్న మార్పులు క్యాంపస్ సెలెక్షన్లను తగ్గిస్తున్నాయి. గతంలో నిపుణులు చేసే ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇప్పుడు ఆటోమేషన్గా మారిపోవడంతో కిందిస్థాయిలో ఎక్కువమంది నిపుణుల అవసరం లేకుండా పోయింది. కృతిమ మేధ, రోబోటిక్స్, డేటా విశ్లేషణ, ఐఓటీ, వర్చువల్ రియాలిటీ తదితర డిజిటిల్ సాంకేతిక పరిజ్ఞానం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పరిజ్ఞానాల్లో నైపుణ్యాలు ఉన్న విద్యార్థులు కాలేజీల్లో లభించక కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్ల ప్రాధాన్యాం తగ్గిస్తున్నాయి. ఉన్న ఉద్యోగులకే డిజిటల్ పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలు సున్న బెంచ్ విధానంలోకి వచ్చాయి. ‘పని ఉంటేనే ఉద్యోగి' విధానంలో అవసరమైనప్పుడు ఇతర మార్గాల ద్వారా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కంపెనీలోని ఉద్యోగుల సహకారం తీసుకుంటున్నాయి. దీంతో గత రెండేళ్లగా క్యాంపస్ సెలెక్షన్లు బాగా తగ్గాయని.. భవిష్యత్లో మరింత తగ్గొచ్చని సాఫ్ట్వేర్ పరిశ్రమ నిపుణులు చెప్తున్నారు.

వెంటాడుతున్న డిజిటల్ నిపుణుల కొరత
దేశంలో దాదాపు 16 లక్షల ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 50 శాతం మాత్రమే భర్తీ అవుతున్నాయి. దీంతో ఆర్థికంగా ఇంజినీరింగ్ కాలేజీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు విదర్భ వంటి ప్రాంతాల్లో అనేక ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్ కాలేజీలు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోలేక పోతున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చలేకపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో బోధన చేయగల ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగానే ఉంది. దీంతో డిజిటల్ నైపుణ్యాలు ఉన్న విద్యార్థులను మాత్రమే కోరుకుంటున్న సాఫ్ట్వేర్ కంపెనీలు క్యాంపస్ సెలెక్షన్లు ఆసక్తి చూపడం లేదు. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో జరిగే క్యాంపస్ సెలక్షన్లలో కూడా 15-20 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదు. అవసరం లేకపోతే.. ఒక్కరినీ తీసుకోవడానికి కంపెనీలు ఇష్టపడడం లేదు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్లో క్యాంపస్ సెలెక్షన్ల గురించి కంపెనీలు మర్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఎన్ఐఐటీ సీఈఓ రాహుల్ పట్వర్థన్ వ్యాఖ్యానించారు.

చిన్న కంపెనీలు, స్టార్టప్లపై ఫోకస్ పెట్టాలి
రెండు, మూడేళ్లుగా క్యాంపస్ సెలెక్షన్లు తగ్గుతున్నాయని ధన్వంతరి డైరెక్టర్ కేవీ అచలపతి వ్యాఖ్యానించారు. గతంలో సాంకేతిక విద్యార్థులతోపాటు ఇంజినీరింగేతర విద్యార్థుల నియామకాలు కూడా బాగా ఉండేవని తెలిపారు. పరిశ్రమ మారుతున్నాయని సెలెక్షన్లు తగ్గుతున్నాయని చెప్పారు. విద్యార్థులు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యంతోతోపాటు జర్మనీ, స్పానిష్, ఫ్రెంచ్ వంటి భాషల్లో పట్టు సాధిస్తే ఇతర దేశాలకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయన్నారు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఐటీ పరిశ్రమకు భారీగా నైపుణ్యాలు ఉన్న నిపుణుల అవసరం లేదని హ్యుసిన్ కన్సల్టింగ్ అధినేత జీఆర్ రెడ్డి తెలిపారు. గతంలో సీనియర్లను తొలగించిన మేరకు కలిగే ప్రయోజనానికి అనుగుణంగా కంపెనీలు కొత్త వారిని నియమించుకునేవి. ఇప్పుడు ఆ విధంగా చేయడం లేదని పేర్కొన్నారు. కాలేజీలు పెద్ద కంపెనీల వైపే చూడాల్సిన అవసరం లేదని, చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలపై దృష్టి పెట్టొచ్చునని, ఒక పెద్ద కంపెనీకి బదులు.. 10 చిన్న కంపెనీలు, స్టార్టప్ కంపెనీలను ఆకర్షించగలిగితే.. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications