సీఎం వస్తున్నారు.. శుభ్రంగా స్నానం చేసి రండి: యోగి పర్యటనలో దళితుల పట్ల ఇలా!
యూపీలో ముషర్ వర్గానికి చెందినవారు ఎలుకలను పట్టుకోవడమే ప్రధాన వృత్తిగా జీవితస్తుంటారు. దాంతో వారిని తక్కువ వర్గంగా అవమానించడం జరుగుతోంది.
లక్నో: దేశంలో దళితుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో చెప్పడానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. అంటరానితనం పోయింది.. దేశం అభివృద్దిలో దూసుకుపోతుందని వేదికల మీద ప్రసంగాలు దంచే నాయకులు తమ చిత్తశుద్ది ఏపాటిదో బయటపెట్టుకుంటున్నారు.
స్నానం చేసొస్తేనే..సీఎంను కలిసేందుకు అవకాశమిస్తామని యూపీ సీఎం రాక సందర్భంగా అక్కడి దళితులకు ఆదేశాలు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కుషినగర్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో.. ఆయన రాకకు ముందు అక్కడి దళితులకు షాంపూలు, సోపులు ఇచ్చి శుభ్రంగా స్నానం చేసి రావాలని సూచించారు.
ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, యూపీలో ముషర్ వర్గానికి చెందినవారు ఎలుకలను పట్టుకోవడమే ప్రధాన వృత్తిగా జీవితస్తుంటారు. దాంతో వారిని తక్కువ వర్గంగా అవమానించడం జరుగుతోంది. ఇందులో భాగంగానే సీఎం పర్యటనకు ముందు.. స్నానం చేసి రావాలని వారికి హుకుం జారీ అయింది.
మరోవైపు.. సీఎం వస్తున్నాడనగానే అక్కడి అధికారులు ఆగమేఘాల మీద విద్యుద్దీపాలు, రోడ్లు, టాయిలెట్లు వంటివి ఏర్పాటు చేయించారట. అప్పటిదాకా అక్కడి జనం గురించి ఏమాత్రం పట్టించుకోని అధికారులు.. సీఎం వస్తున్నాడని తెలియగానే ఈ ఏర్పాట్లని చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే, ఇటీవల పాక్ దాడుల్లో మరణించిన బీఎస్ఎఫ్ జవాను ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సమయంలోను యోగి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన వస్తున్నాడని తెలియగానే ప్రేమ్ సాగర్ ఇంట్లో సోఫాలు, ఏసీ, కార్పెట్లు ఏర్పాటు చేయించిన అధికారులు.. ఆయన వెళ్లగానే వాటిని అక్కడి నుంచి తొలగించారు. దీనిపై యూపీలో చాలా విమర్శలే వచ్చాయి.