రాజ్కోట్లో టీమ్స్: హార్దిక్ పటేల్ ప్లాన్ ఏమిటి?
రాజ్కోట్ : గుజరాత్లోని రాజ్కోట్లో భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 18న మూడో వన్డే జరగనుంది. ఈ వన్డేలో పటేల్ వర్గీయులు నిరసనలు, ఆందోళనలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుందో. ఈ మ్యాచ్ను చూసేందుకు పటేల్ వర్గీయులు 1000 మంది పటేల్స్ టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే భారత, దక్షిణాఫ్రికా జట్లు రాజ్కోట్కు చేరుకున్నాయి.
పటేళ్ల నిరసనలు, ఆందోళనలను కట్టడి చేసేందుకు భద్రతా బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీల్లో చేర్చాలని హార్దిక్ పటేల్ నేతృత్వంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే.
మూడో వన్డేకు దాదాపు 2 వేల టికెట్లు అమ్మగా, వాటిలో సగం పతిదార్ ఆందోళనకారులే కొనుగోలు చేశారు. ప్రపంచానికి తమ ఆందోళన గురించి తెలియజేసేందుకు మూడో వన్డే మ్యాచును వాడుకుంటామని పటేల్ ఇదివరకే చెప్పారు. మొత్తం రాజ్కోట్ మైదానంలో 29 వేల సీట్లున్నాయి. వీటిలో వేయి సీట్లు పటేల్ వర్గీయులు కొనుగోలు చేశారు.
పటేళ్ల ఆందోళన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనేవారు తప్పనిసరిగా ఐడి కార్డులు చూపించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిబంధనను పెట్టింది. మ్యాచ్ను హర్దీక్ పటేల్ నేతృత్వంలోని పతిదార్ అనామత్ ఆందోళన్ సమితి కార్యకర్తలు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారనే నేపథ్యంలో సోమవారం పలువురు యువతీయువకులు మైదానంలో శాంతి ప్రార్థనలు చేశారు.
మ్యాచ్ సందర్భంగా తమ వర్గీయులు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారని హార్దిక్ పటేల్ చెప్పారు. మూడో వన్డే సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్కు పరీక్షలాంటింది.