పవన్ కల్యాణ్ కాకినాడ సభ అందుకే: బిజెపి కార్నర్
కాకినాడ: ప్రత్యేక హోదాపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై ఆయన గళమెత్తారు. దీంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తాజాగా ఆయన ఈ నెల 9వ తేదీన కాకినాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
కాకినాడ బహిరంగ సభకు సెంటిమెంట్ను జత చేసి ఆయన బిజెపిని మరింత ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాకినాడలోనే బహిరంగ సభ నిర్వహించడానికి జనసేన పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ చెప్పిన కారణం చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్లో బహిరంగ సభ తలపెట్టామని, దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పదేళ్ల కిందట బీజేపీ కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో 'ఒక ఓటు రెండు రాష్ట్రాలు' నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని చెప్పారు. ఈ నినాదమే రాష్ట్ర విభజనకు దారి తీసిందన్నారు. రాష్ట్ర విభజనలో బీజేపీ కీలకంగా వ్యవహరించినందున, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆ పార్టీయే ఇవ్వాలనే డిమాండుతో పవన్ ఇక్కడ సభ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఇందుకు అనుమతిచ్చిన జేఎన్టీయూకే యాజమాన్యానికి, పోలీసు శాఖకు రాఘవ కృతజ్ఙతలు తెలిపారు.
బిజెపిని కార్నర్ చేయడానికే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాకినాడలో ప్రత్యేక హోదాపై బహిరంగ సభలో మాట్లాడుతారని తెలుస్తోంది. కాకినాడలోనే ఆయన బహిరంగ సభ పెట్టడానికి కారణాన్ని ఆ పార్టీ ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications