పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్: ఘర్షణ, ట్విస్ట్?
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఇద్దరు తెలుగు సినీ హీరోల అభిమానుల నడుమ ఏర్పడిన బ్యానర్ల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. బాహుబలి పోస్టర్లు కూడా వెలియడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టి ప్రభాస్ అభిమానులపైకి మళ్లింది. దాంతో ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తింది. ఇరువురి అభిమానుల మధ్య ఘర్షణ కొత్త మలుపు తిరిగింది. అది రెండు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారే పరిస్థితి దాపురించింది. దాంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రంగంలోకి దిగారు.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు బుధవారం భీమవరం పట్టణంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిలో స్థానిక ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుండి అడ్డవంతెన వరకు ఏర్పాటుచేసిన బ్యానర్లను బుధవారం రాత్రి ఎవరో చించేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు స్థానిక అడ్డవంతెన వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
అంతకుముందు బాహుబలి చిత్ర విడుదలను పురస్కరించుకుని ఆ ప్రాంతంలో ప్రభాస్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు నెలకొల్పారు. దీంతో అనుమానం వారిపైకి మళ్ళింది. ఇది కాస్తా రెండు సామాజిక వర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని బ్యాంకు ఎటిఎంలపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలాయి.
పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన పవన్ అభిమానులను సముదాయించే ప్రయత్నంచేశారు. పవన్కళ్యాణ్ బ్యానర్లను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారని మెంటే వెంకటేష్నాయుడు చేసిన ఫిర్యాదుమేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. బాహుబలి బ్యానర్లను తొలగించారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని రౌతుల ఏసు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదుచేశారు. ఇరు వర్గాల పెద్దలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.