రోజా ఇష్యూ: చంద్రబాబు పంతం, జగన్ ఫైట్ (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాను ఎట్టి పరిస్థితిలోనూ శాసనసభలోకి అడుగు పెట్టనివ్వకూడనదే పంతంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన పంతానికి అనుగుణంగానే అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
రోజా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చినపుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే తన న్యాయవాదులతో కలిసి రాగా పోలీసులు, మార్షల్స్ ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో మార్షల్స్కు, వైకాపా ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది.
న్యాయవాదులను సైతం అనుమతించకపోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలో అసెంబ్లీకి వచ్చిన విపక్షనేత జగన్ విషయం తెలుసుకుని తమ ఎమ్మెల్యేను ఎందుకు అనుమతించడం లేదని మార్షల్స్ను నిలదీశారు. న్యాయవాదులను తన వాహనంలో తీసుకువెళ్లేందుకు జగన్ ప్రయత్నించగా, ఎమ్మెల్యేల ప్రవేశద్వారం వద్ద జగన్ వాహన శ్రేణిని పోలీసులు నిలిపివేశారు.
వైసిపి ఎమ్మెల్యేల ఆందోళన
రోజాను సభకు అనుతించకపోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. ఆమెకు సంఘీబావంగా నిలిచారు.
నన్ను కూడా వెళ్లనివ్వరా..
తనను కూడా అసెంబ్లీలోకి అనుమతించరా అని జగన్ నిలదీశారు. మిమ్మల్ని అడ్డుకోబోమని కాని రోజాను అనుమతించేది లేదని చీఫ్ మార్షల్ గణేష్బాబు స్పష్టం చేశారు.
రోజాకు పాస్ ఇస్తా..
ఒక దశలో తాను రోజాకు పాస్ జారీ చేస్తామని జగన్ చెప్పారు. దానికి అనుమతించిన మార్షల్స్ రోజాను వైఎస్ఆర్సిపి లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం వరకూ అనుమతి ఇచ్చారు.
గాంధీ విగ్రహం వద్ద ధర్నా..
లోపలికి వచ్చిన వైకాపా సభ్యులు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కొద్ది సేపు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. జగన్ సహా ఎమ్మెల్యేలు బైఠాయింపు జరిపారు.
హైకోర్టు ఆదేశాలు చదవండి: స్పీకర్
రోజా అంశంపై సోమవారం చర్చిద్దామని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. సభ తీసుకున్న నిర్ణయంపై తిరిగి సభలోనే చర్చించాలన్న స్పీకర్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను సభలో సభ్యులకు పంపిణీ చేశారు.
సోమవారం విచారణ
కాగా, శాసనసభ వ్యవహారాల శాఖ తరఫున ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు బెంచి సోమవారం పరిశీలించనుంది.
శాసనసభను బహిష్కరించిన వైసిపి
రోజాను అసెంబ్లీలోకి రానివ్వక పోవడంతో వైకాపా ఎమ్మెల్యేలు శుక్రవారం సభను బహిష్కరించారు. శాసనమండలి సభ్యులు సైతం మండలిలో సభను బషిష్కరించి వాకౌట్ చేశారు.
రాజభవన్కు ...
బైఠాయింపు తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయంలో తమ ఫిర్యాదును అందజేశారు.
వైసిపి హక్కుల ఉల్లంఘన నోటీసు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరో ముగ్గురు మంత్రులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
ఉరి తీస్తారా..
కోర్టుల కంటే శాసనసభ ఉన్నతమని అంటున్నారని, రేపు రోజాను ఉరితీయాలని సభ తీర్మానిస్తే తనను ఉరి తీసేస్తారా అని వైకాపా ఎమ్మెల్యే ఆర్కె రోజా ప్రశ్నించారు.
బ్లాక్ డేగా..
ప్రజాస్వామ్యంలో ఈ రోజును బ్లాక్డేగా పరిగణిస్తున్నామని రోజా అన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగితే కోర్టులు సవరిస్తాయని వాటిని మనం పాటించాల్సి ఉంటుందని అన్నారు. కాని ఎపి అసెంబ్లీ న్యాయవ్యవస్థను సైతం ధిక్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం..
శనివారం శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైయస్ జగన్ తన పార్టీ శాసనసభ్యులతో సమావేశమయ్యారు.