5కు పది పాక్ తలలు తెగాలి: ఆ తండ్రికి తీరని వ్యధ
పాట్నా: యూరి ఆర్మీ క్యాంప్ పైన దాడి ఘటన 78 ఏళ్ల అంధ తండ్రికి తీవ్ర వ్యథను మిగిల్చింది. బీహార్లోని బోజ్పుర్ జిల్లాలోని రంక్తుకు చెందిన జగ్ నారాయణ సింగ్ రెండో కుమారుడు అశోక్ సింగ్ యూరి ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
ముప్పై ఏళ్ల క్రితం 1986లో అతని పెద్ద కొడుకు కాంతా సింగ్ (23) కూడా దేశ రక్షణలో అసువులు అమరుడయ్యాడు. అప్పట్లో బిక్నీర్లో జరిగిన పేలుడులో కాంతాసింగ్ అసులువులు బాసాడు.
ఆర్మీకి సేవలు అందిస్తున్న నా రెండో కొడుకును కోల్పోయానని, దేశ రక్షణలో నా ఇద్దరు కొడుకులు అమరులయ్యారని, ఇందుకు నేను గర్విస్తున్నానని తండ్రి జగ్ నారాయణ సింగ్ చెప్పారు.
అదే సమయంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. తనకు ఓపిక ఉందని తన కుమారుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటానని, భారత సైన్యం తరఫున తనను పంపించాలని ఆవేదన చెందారు. ప్రత్యర్థులు మన సైనికులను ఎలా హతమార్చారో, మనం అలాగే చేయాలని ఉద్వేగానికి లోనయ్యారు.
జగ్ నారాయణ సింగ్ కుటుంబానికి ఇది రెండో విషాదం. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కాంతా సింగ్ కూడా సైనికుడే. అయితే, 1986 లో రాజస్థాన్లోని బికనేర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో కాంతా సింగ్ వీర మరణం పొందాడు. తాజాగా, రెండో కుమారుడు అశోక్ కుమార్ సింగ్ యూరీ ఘటనలో అసువులు బాశాడు. ఈ విషాదంతో జగ్ నరైన్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అయిదుగురు భారత జవాన్ల మరణానికి ప్రతిగా 10 మంది శత్రువుల తలలు తెగ నరకాలని జగ్ నారాయణ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామానికే తిరిగి రావాలని అశోక్ కుమార్ అనుకునేవాడని, యువతను ఆర్మీలో చేర్చేందుకు ప్రోత్సహించేవాడని తన కొడుకు గురించి చెప్పారు. 1992లో సైన్యంలో చేరిన అశోక్ కుమార్ దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాలలో పని చేశాడని, ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని భిన్నగురి నుంచి యూరీ సెక్టార్కు వచ్చాడన్నారు.
సరైన వసతి దొరికిన తర్వాత తన భార్య సంగీతను కూడా తీసుకువెళ్తానని చెప్పాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని జగ్ నారాయణ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. జగ్ నారాయణ సింగ్ కుమారులు మాత్రమే కాదు, వారి బంధువుల్లో చాలామంది సైన్యంలో చేరినవారే. అశోక్ కుమార్ సింగ్ పెద్ద కుమారుడు వికాస్ సింగ్ కూడా సైన్యంలో ఇటీవలే చేరాడు. ధన్పూర్ కంటోన్మెంట్లో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అశోక్ కుమార్ తాత రాజ్ గిరీ సింగ్, బాబాయిలు, ఇద్దరు మేనళ్లుల్లు కూడా భారత సైన్యంలో పని చేశారు.
దేశం కోసం తన కొడుకు ప్రాణాలు అర్పిస్తే ఏ తండ్రి సంతోషించడని జగ్ నారాయణ సింగ్ అన్నారు. అయితే పాకిస్తాన్కు కచ్చితంగా బుద్ధి చెప్పాలన్నారు. ఐదుకు పది తలలు తెగాలన్నారు. తన ఒంట్లో ఓపిక ఉందని, తనకు సైన్యం తరఫున పోరాడే అవకాశమిస్తే తన కొడుకును చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని 78 ఏళ్ల జగ్ నారాయణ సింగ్ అన్నారు.