పద్మ అవార్డుల జాబితా నుంచి రజనీ ఔట్: అందుకేనా?
న్యూఢిల్లీ: పద్మ అవార్డుల జాబితా నుంచి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరును తొలగింపునకు గురైంది. పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన జాబితాలో ఆయన పేరు ఉంది. ఆ తర్వాత ఆయన పేరును తొలగించారు. అయితే, తమిళనాడు రాష్ట్రంలో పాగా వేయడానికి బిజెపి రజనీకాంత్ను తమ వైపు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, ఆయన అందుకు ముందుకు రాలేదు. పద్మ అవార్డుల జాబితా నుంచి ఆయన పేరు ఉద్వాసనకు గురి కావడంతో అందుకు సంబంధించిన చర్చ సాగుతోంది.
మొత్త 1,793 మందిని సిఫార్సు అయిన తర్వాత తొలగించారు. అలా ఉద్వాసనకు గురైన ప్రముఖ వ్యక్తుల్లో సూపర్స్టార్ రజనీకాంత్, యోగా గురువు రామ్దేవ్ బాబా, బిజెపి నాయకుడు, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా తదితరులు ఉన్నారు. ఆధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయి, భారత్లో అమెరికా రాయబారిగా పనిచేసిన రాబర్ట్ బ్లాక్విల్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్, పారిశ్రామికవేత్త బ్రిజ్ మోహన్లాల్ ముంజల్ తదితరులను కూడా సిఫారసు చేసినప్పటికీ వారి కూడా పద్మ అవార్డులకు ఎంపిక కాలేదు.
2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు అందుకున్న రజనీకాంత్ను ఈసారి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్' అవార్డుకు సిఫారసు చేశారు. అయితే ఈ ఏడాది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో పాటు బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ, ప్రకాష్ సింగ్ బాదల్, బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్లను పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.
ఈ ఏడాది పద్మ అవార్డులకు సిఫారసు అయినఇతర ప్రముఖుల్లో మలయాళ సినీ స్టార్ మోహన్లాల్, జమ్మూ-కాశ్మీరు బిజెపి నేత దరాక్షన్ అంద్రాబీ, అథ్లెట్ అంజూ బాబీ జార్జ్, బ్యుటీషియన్ షహనాజ్ హుసేన్, సినీ నిర్మాత రోహిత్ శెట్టి, అపోలో హాస్పిటల్స్ ఎండి ప్రీతా రెడ్డి, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఉన్నారు.
ఈ ఏడాది పద్మ అవార్డులకు పేర్లను ఖరారు చేయడానికి ముందే తాను ఈ అవార్డును స్వీకరించబోనని రామ్దేవ్ బాబా ప్రకటించారు. దాంతో ఆయన పేరును తొలగించడంపై ఊహాగానాలు చెలరేగడం లేదు గానీ రజనీకాంత్ పేరును తొలగించడంపై మాత్రం చర్చ సాగుతోంది.