జగన్, బాబు మౌనం: సీమాంధ్ర రాజధానిపై ట్విస్ట్!
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో రాజధాని కోసం నేతల మధ్య పోటా పోటీ నెలకొంది. కర్నూలు, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, మాచర్ల... ఇలా పలు డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ మొదటి నుండి విశాఖను రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టిజి వెంకటేష్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వంటి వారు రాయలసీమలో రాజధాని ఉండాలంటున్నారు.
మాచర్ల అయితే బాగుంటుందని జెసి దివాకర్ రెడ్డి ఓ కొత్త ప్రతిపాదనను తెర పైకి తీసుకు వచ్చారు. అలాగే ఆయా ప్రాంతాల నేతలు విజయవాడ, గుంటూరు.. ఇలా డిమాండ్లు తీసుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖకే ఎక్కువ అవకాశాలున్నాయని రాజ్యసభ సభ్యులు సుబ్బరామి రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలోని తన నివాసంలో మంగళవారం విలేఖర్లతో మాట్లాడుతూ పారిశ్రామికంగా అభృవద్ధి చెంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న విశాఖ ప్రాంతాన్ని రాజధానిగా చేయవచ్చన్నారు.
అయితే రాష్ట్రంలో ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కర్నూలు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం విశాఖని, విశాఖ నుంచి భోగాపురం వరకు పదివేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ప్రజలు ఇక్కడే రాజధాని ఏర్పాటు కావాలని కోరుకుంటున్నారన్నారు.
కాగా, సీమాంధ్ర రాజధానిపై మీడియా కథనాలు, రాజకీయ ప్రకటనలతో విశాఖ నుంచి కర్నూలు వరకూ చర్చలు రసకందాయంలో పడ్డాయి. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఆపద్ధర్మ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిలు రాయలసీమకు చెందిన వారు. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని అందరూ ఊహించినట్టుగా విశాఖపట్నం, కర్నూలు ఉండకపోవచ్చునని, రాయలసీమ జిల్లాలకు చెందిన బలమైన నేతలే కొత్తగా ఏర్పాటవుతున్న సీమాంధ్ర రాష్ట్ర రాజకీయాలను శాసించవచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు.
రాజధాని విషయంలో జగన్, చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. బాబు తాజాగా సీమాంధ్ర గురించి ప్రకటన చేస్తూ సీమాంధ్రకు కొత్త రాజధాని కొత్త శాసనసభే నిర్ణయిస్తుందని ప్రకటించారు. తమకు అధికారం ఇస్తే సుందర నగరం నిర్మిస్తామని, జగన్కు అధికారమిస్తే చంచల్గూడ జైలు నిర్మిస్తారని సెటైర్ కూడా వేశారు. ఇక జగన్ రాజధాని విషయంలో ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారట.
పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం కొత్త రాజధాని ఎంపిక బాధ్యతను ఒక కమిటీకి అప్పగించనున్నారు. ఇందులో ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానింగ్, జల వనరుల, విద్యుత్, జనాభా, ఉపరితల రవాణా, రోడ్డు రవాణా నిపుణులతోపాటు అనుభవమున్న రిటైర్డు బ్యూరోక్రాట్ను నియమించనున్నారు. రెండుమూడు రోజుల్లో ఈ మేరకు ప్రకటన వెలువడనుంది. పైగా కమిటీకి గడువు ఆరు నెలలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఈ కమిటీ ఆగస్టు 31 లోపల నివేదికను కేంద్రానికి ఇస్తుంది. నివేదికను కొత్త శాసనసభకు కేంద్రం సీమాంధ్ర ప్రభుత్వం ద్వారా పంపనుంది. కమిటీ నివేదికను కొత్త శాసనసభ పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తిరస్కరించి మరో కమిటీని నియమించుకునే అధికారం ఉంది. ఈసారి సీమాంధ్రకు రెండు రాజధానులు ఉండబోతున్నాయంటున్నారు. ఒకటి సంపూర్ణ రాజధాని, మరొకటి శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా రాజధానిని ఒక ఎంపిక చేసిన నగరంలో నిర్మించే అవకాశముందంటున్నారు.
ప్రస్తుతం రాజధాని రేసులో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ - గుంటూరు, మాచర్ల, దొనకొండ, కర్నూలు, తిరుపతి ఉన్నాయి. మరో రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న నగరంలో కాకుండా, అన్ని ప్రాంతాలకు సౌలభ్యంగా ఉండి ఇప్పటికే మౌలిక సదుపాయాలతో విరాజిల్లుతున్న విజయవాడను సంపూర్ణ రాజధాని చేసి, శీతాకాలం రాజధానిని తిరుపతి లేదా కర్నూలులో ఏర్పాటు చేసే అవకాశాలు కనపడుతున్నాయి.