మొన్న వెంకయ్య, నిన్న బాబు: ప్రత్యేక హోదా హుళక్కే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హుళక్కే అవుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకు ముందు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పిన మాటలను బట్టి, తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలను బట్టి ఎపికి ప్రత్యేక హోదా దక్కడం కలలోని విషయంగా మారిపోయినట్లు అనిపిస్తోంది. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చిందుకు ఇతర రాష్ట్రాలను ఒప్పించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు ఇంతకు ముందు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చంద్రబాబు సోమవారంనాడు మంత్రులతో అన్నారు.
ఇతర రాష్ట్రాలు కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు తమకు కూడా ఆ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ చాలా కాలంగా ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎపికి ప్రత్యేక హోదా కల్పించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు కూడా రాశాయి. తెలంగాణ కూడా ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తే తమకు కూడా కల్పించాలని అడుగుతోంది. ఈ స్థితిలో వెంకయ్య నాయుడు వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ రాష్ట్రాలను ఒప్పించడం సాధ్యమయ్యే పని కాదు. ఒక వేళ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మరిన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చుకుంటే పోతే దానికి అంతు ఉండకపోవచ్చు. అందువల్ల ఎపికి ప్రత్యేక హోదా కల్పించి కేంద్రం కొరివితో తల గోక్కుంటుందని అనుకోలేం.
పరిస్థితిని గుర్తించే చంద్రబాబు నాయుడు మంత్రులతో అసలు విషయం చెప్పి ఉంటారని భావిస్తున్నారు. పైగా,కేంద్రం నుంచి పెద్దగా సాయం లభించే పరిస్థితి కన్పించడం లేదని, సొంత శక్తితోనే ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కూడా చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. సోమవారం విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల అనంతరం ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనలను, అలాగే ఏపీలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వచ్చిన వార్తలను మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. కేంద్రం నుంచి సాయం రాబట్టడానికి తాము శతవిధాలా ప్రయత్నం చేస్తున్నానని, పెద్దగా సానుకూల వాతావరణం కనిపించటం లేదని చంద్రబాబు దానికి ప్రతిస్పందింస్తూ అన్నారు.
ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90 శాతం మనకు గ్రాంట్గా వస్తాయని, ప్రత్యేక ప్రతిపత్తి లేకుండా 60 శాతం నిధులు గ్రాంట్గా ఇస్తామని కేంద్రం సూచించిందని, దాన్ని కనీసం 80 శాతం అయినా చేయాలని తాను ప్రయత్నం చేస్తూ వస్తున్నానని, కేంద్రానికి వారి ఇబ్బందులు వారికి ఉన్నాయని, మనం కూడా కేంద్రంతో ఘర్షణ పడే పరిస్థితి లేదని, స్నేహంతోనే సాధించుకునే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఈ మాటలను బట్టి చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ను వదులుకున్నారని అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినా, ప్రసుత పరిస్థితి చూస్తే 7 జిల్లాలకు కలిపి రూ.350 కోట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు వెల్లడించారు. మొదట ఏడాదికి రూ.10 కోట్లు ఇస్తామని కేంద్రం ప్రతిపాదించిందని తాను అనేక సార్లు చర్చలు జరిపి ఆ సాయాన్ని రూ.70 కోట్లకు పెంచగలిగానని, ఆ లెక్కన ఐదేళ్లకు కలిపి ఆ ఏడు జిల్లాలకు వచ్చే మొత్తం రూ.350 కోట్లకు మించి ఉండే పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలిపారు.
రాజధాని నిర్మాణానికి ఓకె
రాజధాని నిర్మాణానికి మాత్రం కొన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సుముఖంగా ఉందని అది సుమారుగా రూ.2 నుంచి 3 వేల కోట్ల వరకూ ఉండొచ్చని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఉన్న లోటు బడ్జెట్ పూడ్చుతామని విభజన చట్టంలో చెప్పినా అది కూడా ఇంత వరకూ నెరవేరలేదని కేంద్రం దానిపై స్పష్టంగా ఏదీ చెప్పటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి సమస్యలు ఉన్నా కేంద్రంతో ఘర్షణ పడడానికి చంద్రబాబు ఇష్టపడకపోగా, ఘర్షణ పడకూడదని మంత్రులకు సూచించారు.
ఇలాంటి సమస్యలన్నా కేంద్రంతో మనం స్నేహపూర్వకంగానే సాగాలని కోరుకుంటున్నానని, మంత్రులు ఎవరు కూడా కేంద్రంపై ఎటువంటి వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు చేయొద్దని, సంయమనంతోనే వెళదామని సూచించారు. రాష్ట్రంలో ఆర్థికపరిస్థితి క్లిష్టంగా ఉందని, దేవుడు దయ ఉంటే ఏటికి ఎదురీదుతూ సమస్యలు పరిష్కరించుకోగలుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications