అసెంబ్లీ సీట్ల పెంపు: మోకాలడ్డుతున్న సంఘ్, 'చంద్రులకు' చుక్కలే...
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడు ఇద్దరూ తమ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుపైనే దృష్టి సారించారు.
హైదరాబాద్ / అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రశేఖర్ రావు, చంద్రబాబునాయుడు ఇద్దరూ తమ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుపైనే దృష్టి సారించారు. తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు నియోజకవర్గాల పునర్విభజన అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతుండగానే.. రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు నాడు సనత్ నగర్ ఎమ్మెల్యే - జాతీయ ప్రక్రుతి వైపరీత్యాల యాజమాన్య సంస్థ వైస్ చైర్మన్ హోదాలో మర్రి శశిధర్ రెడ్డి రెండు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెంచాలని కేంద్రానికి సిఫారసు చేశారు. అందుకు అనుగుణంగా వర్క్ షాప్ నిర్వహించి ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి మరీ కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో నాడు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంచాలని పేర్కొన్నది. కానీ చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లవుతున్నా అతీగతీ లేదు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను కీలకమలుపు తిప్పనున్న నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని నిన్నటి వరకూ నిబంధనల పేరుతో అసాధ్యం అని చెబుతూ వచ్చిన బీజేపీ అధినాయకత్వం పునర్విభజన చేస్తే తమకేంటి లాభం అన్న ఆలోచనలో పడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కూడా అసెంబ్లీ సీట్ల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలియ వచ్చింది. ఇటీవల జాతీయ స్థాయిలో రాజకీయంగా విధాన నిర్ణయాలన్నీ ఆరెస్సెస్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.
బీజేపీకి లబ్ది లేనప్పుడు పెంపు ఎందుకు?
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక నుంచి కేంద్ర క్యాబినెట్లో మార్పుల దాకా నాగ్పూర్ కేంద్రంగా ఆరెస్సెస్ జారీ చేస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదని సంఘ్ పరివార్ భావిస్తున్నట్టు తెలిసింది. రెండు రాష్ట్రాల బీజేపీ శాఖలు కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచొద్దని పట్టుబడుతున్నాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఆరెస్సెస్ నేతలతో జరిగిన చర్చల్లో ప్రస్తావించారు. బీజేపీకి రాజకీయ ప్రయోజనం లేనప్పుడు సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరమేమిటని సంఘ్ నేతలు కూడా అభిప్రాయ పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీ స్థానాల పెంపునకు రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు, ఏపీలోని ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుంగు సంస్థగా పరిగణిస్తున్న ఒక మీడియా సంస్థ వార్తాకథనాన్ని వండి వార్చి రాష్ట్ర ప్రజలపైకి వదిలేసింది.
Recommended Video
అసెంబ్లీ సీట్లపైనే ఇరువురు సీఎంల ఆసక్తి
విభజన చట్టంలోని పలు అంశాలపై విభేదాలపై సతమతం అవుతున్నా పట్టించుకుని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు అదే చట్టంలోని నియోజకవర్గాల పునర్విభజనపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలను పునర్విభజన చేయాల్సిందేనని గట్టిగా పట్టుబడుతూ ఉన్నాయి. అందులోనే వాటి రాజకీయ భవితవ్యం ఇమిడి ఉన్నది మరి. మంగళవారం నూతన రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతున్న వారిద్దరూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అసెంబ్లీ స్థానాల పునర్విభజనపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనే ప్రధాన ఎజెండాగా వీరి మధ్య చర్చ జరుగనున్నదని తెలుస్తున్నది. ఈ విషయమై బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోమవారం సమావేశమై నియోజకవర్గాల పునర్విభజనపై ప్రాథమికంగా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం చంద్రబాబుకు వివరించి తుది చర్చలను జరుపుతారు.
ముసాయిదా బిల్లు.. క్యాబినెట్ నోట్ రెడీ
ఆరెస్సెస్తోపాటు బీజేపీ జాతీయ నాయకత్వం సుముఖంగా ఉంటే తప్ప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సందేహస్పదమేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014లో పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం తప్పనిసరి. ఈ విషయమై ముసాయిదా బిల్లు, క్యాబినెట్ నోట్ సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇస్తే రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కానీ ఇంకా రాజకీయ నిర్ణయం జరుగక పోవడం అనుమానాలను తావిస్తున్నది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందా? లేదా? అన్న దాన్ని బట్టే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందో లేదో తేలిపోతుంది.
అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి
వాస్తవానికి సీట్ల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం మొహమాటంతో చేయాల్సిన పనేమీ లేదు. ఇది ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటు కూడా. గత పార్లమెంటు దీనికి ఆమోదం తెలిపింది. ఎటొచ్చీ ఆ చట్టంలోని కొన్ని పదాల కూర్పులో జరిగిన పొరపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టాయిష్టాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.. పార్లమెంట్ చేసిన చట్టం తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. అసెంబ్లీ సీట్లపెంపు తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతకు బాటలు వేస్తుంది. అందుకే సీఎం కేసీఆర్ గత మూడేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ప్రతిసారీ దీన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఎంపీలు పలుమార్లు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు.
కేంద్రం కూడా సుముఖమే కానీ..
కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీని అమలు చేయాలన్న అభిప్రాయంతోనే ఉంది. దీనికి కావలిసిన రాజ్యాంగ సవరణపై కేంద్ర న్యాయ, హోం మంత్రిత్వశాఖలు లోతుగా అధ్యయనం చేసి ముసాయిదా బిల్లుని రూపొందించాయి. కేంద్ర హోం మంత్రిత్వశాఖ క్యాబినెట్ నోట్ను కూడా సిద్ధం చేసింది. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే చర్చించడం, ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోతాయి. దీనికి కొనసాగింపుగా నియోజకవర్గాల డీలిమిటేషన్ కోసం అనుబంధ బిల్లు కూడా ఆమోదం పొందుతుంది. దాని ఆధారంగా ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం డీలిమిటేషన్ కమిటీని నెలకొల్పడం, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో చర్చలు, జనాభా లెక్కల ఆధారంగా స్పష్టతకు రావడం, ప్రజాభిప్రాయ సేకరణ జరుపడం, వ్యక్తమైన అభిప్రాయాలకు అనుగుణంగా సవరణలు చేసి తుది నిర్ణయం తీసుకోవడం తదితరాలన్నీ గరిష్టంగా ఆరు నెలల వ్యవధిలో జరిగిపోతాయి.
ఇలా లాభనష్టాల బేరీజు
ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తేనే డీలిమిటేషన్ కసరత్తు పూర్తి చేయడానికి సమయం సరిపోతుంది. శీతాకాల సమావేశాల తర్వాత 2019 సాధారణ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాల్సి ఉన్నందున, ఆ సమావేశాల్లో బిల్లు వచ్చినా డీలిమిటేషన్కు సమయం సరిపోకపోవచ్చు. అందువల్ల వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభించడాన్ని బట్టే సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది స్పష్టమవుతుంది. 2024 నాటికి తెలంగాణ, ఏపీల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ తన స్వంత బలాన్ని అంచనా వేసుకోవడానికి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. తమకు ప్రయోజనం లేని సీట్ల పెంపుతో అధికారపార్టీలకు లాభం కలిగించడమెందుకని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు రాష్ర్టాల బీజేపీ నేతలు కూడా సీట్ల పెంపు ససేమిరా వద్దంటూ పట్టుపడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేంద్రంలో అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాలు మాత్రమే చెల్లుబాటవుతున్నాయి. సాధారణంగా పార్టీ విషయంలో అమిత్ షాదే తుది నిర్ణయంగా ఉంటున్నది. ఇదిలాఉంటే అసెంబ్లీ సీట్ల పెంపుమీద తెలంగాణ స్థాయిలో ఏపీ పట్టుబట్టడం లేదు. ఢిల్లీలో సోమవారం ఉదయం అమిత్షాతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యి సీట్ల సంఖ్య పెంపుపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా వ్యక్తం చేసే అభిప్రాయాలకు అనుగుణంగా చంద్రబాబు తదుపరి వైఖరిపై స్పష్టత వస్తుంది. అమిత్ ఏ నిర్ణయం చెప్పినా సుజనాచౌదరి సమావేశం తర్వాత అద్భుతం జరిగే అవకాశం లేదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానించాయి.