గవర్నర్కు పవర్పై సుప్రీంకు: కెసిఆర్కు అసద్ తోడు
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతల నియంత్రణ అధికారాన్ని గవర్నర్ నరసింహన్కు కట్టబెట్టాలనే ప్రతిపాదనపై కేంద్రం ముందుకు వెళ్తే సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), అసదుద్దీన్ నాయకత్వంలోని మజ్లీస్ సిద్ధపడుతున్నాయి.
గవర్నర్కు శాంతిభద్రతల నియంత్రణ అధికారాన్ని అప్పగిస్తే అది రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, రాష్ట్రాధికారాన్ని తీసుకోవడమేనని కెసిఆర్ భావిస్తున్నారు. దీనిపై న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్నారు.
హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలనే ప్రతిపాదనపై తెరాస పార్లమెంటు సభ్యులు ఇప్పటికే ఢిల్లీలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్కు శాంతిభద్రతల అంశాన్ని అప్పగిస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని మజ్లీస్ భావిస్తోంది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును అసదుద్దీన్ ఇటీవల కలిశారు. మజ్లీస్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే, తెరాస ఇంప్లీడ్ కావడమా, విడిగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమా అనే విషయంపై న్యాయనిపుణులను సంప్రదించాలని వారిరువురు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆ విషయంపై న్యాయనిపుణులతోనే కాకుండా పార్టీ నాయకులు, మంత్రులతో చర్చించాలని కెసిఆర్ అనుకుంటున్నారు. అన్ని పార్టీల సాయం కోరాలని కూడా ఆయన భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తున్న తెలంగాణ జెఎసి మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది.












Click it and Unblock the Notifications