టీడీపీ-బీజేపీ నడుమ మాటల యుద్ధం.. రంగంలోకి అమిత్ షా!
అమరావతి: ఏపీలో కొద్దిరోజులుగా టీడీపీ-బీజేపీ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఢిల్లీదాకా చేరింది. 'ఇదేనా మిత్రధర్మం' అంటూ ఇరు పక్షాలు పరస్పరం వాగ్బాణాలు సందించుకోవడంపై ఇటు టీడీపీ, అటు బీజేపీ నుంచి 'పెద్దలు' రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ వర్గాల నడుమ తలెత్తిన విభేదాలకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో తెలుగు దేశం పార్టీ నేతలు మంగళవారం సమావేశం కానున్నారు.

చంద్రబాబు హెచ్చరికలు...
ఏపీలో కొద్దిరోజులుగా మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామని, నోరు అదుపులో ఉంచుకోవాలని ఇరు పార్టీల నేతలకూ సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, బీజేపీతో పొత్తు విషయమై అంతగా వద్దనుకుంటే ‘ఒక నమస్కారం' పెట్టి బయటికొచ్చేద్దాం అంటూ ఆయన సీరియస్గా కామెంట్ కూడా చేశారు.

బాబు ఆగ్రహానికీ కారణముంది...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై కోపం రావడానికి, ఆయన కూడా సీరియస్ వ్యాఖ్యలు చేయడానికి కారణముందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టంలోని హామీల విషయంలో కేంద్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉండటం.. నాలుగేళ్లు గడుస్తున్నా హామీల అమలుకు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే మిత్రపక్షమైనప్పటికీ బీజేపీని ఉద్దేశించి అలా సీరియస్ కామెంట్ చేశారని చెబుతున్నారు.

బీజేపీ నేతల ఘాటు స్పందన...
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. తాము కూడా మిత్ర ధర్మాన్నే పాటిస్తున్నామని, బీజేపీతో పొత్తులో ఉండాలో, వెళ్లిపోవాలో ఆయనే తేల్చుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిస్పందించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య చిచ్చు రిగిలిన నేపథ్యంలో ఒకవైపు వచ్చే ఎన్నికల్లో ఇరుపార్టీల నడుమ పొత్తు విషయం ప్రశ్నార్థకంగా మారగా, మరోవైపు ఈ వివాదం ఢిల్లీ బీజేపీ పెద్దల వరకు వెళ్లింది.

అమిత్ షాతో సమావేశం కానున్న టీడీపీ నేతలు...
ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీల మధ్య తలెత్తిన వివాదానికి తెరదించాలనే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్లు సమాచారం. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాతో తెలుగుదేశం నేతలు మంగళవారం సమావేశం కానున్నారు. అమిత్ షాతో జరిగే భేటీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ తోట నర్సింహం పాల్గోనున్నారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాన్ని అమిత్ షాకు వివరిస్తామని, బీజేపీ నేతల తీరును కూడా ప్రస్తావిస్తామని సుజనా చౌదరి తెలిపారు.

పనిలో పనిగా విభజన చట్టం హామీలపైనా....
టీడీపీ-బీజేపీల మధ్య తలెత్తిన వివాదం పరిష్కార బాధ్యతలను అమిత్ షాకు ప్రధానే స్వయంగా అప్పగించినట్లు తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం కొన్ని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం మినహా, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ ఎంపీ తోట నరసింహం అన్నారు. ఎలాగూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అవుతున్నారు కాబట్టి పనిలో పనిగా మరోసారి విభజన చట్టంలో ఇచ్చిన హామీలైన అసెంబ్లీ సీట్ల పెంపు, రైల్వే జోన్, రెవెన్యూ లోటు తదితర అంశాలపైనా టీడీపీ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications